Nirmala Sitharaman: ఆ విషయంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండటం కీలకం.. నిర్మలమ్మ సూచనలు..
Nirmala Sitharaman: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత హవా నడుస్తోంది. ఇదే క్రమంలో స్వావలంబన దిశగా దేశం అడుగులు వేస్తూ ఆత్మినిర్బర్ భారత్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందుకు రాష్ట్రాల పనితీరు చాలా కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
భారత సంస్కృతి
అనవసర ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం భారతీయ సంస్కృతి కాదు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పునరుద్ఘాటించారు. 'స్వయం-ఆధారిత భారతదేశం' కోసం ఆర్థిక ఏకీకరణ ఒక ముఖ్యమైన అంశంగా ఆమె అభివర్ణించారు. కొన్ని రాష్ట్రాలు అనవసరమైన వస్తువుల కోసం విచక్షణారహితంగా రుణాలు తీసుకుని ఖర్చు చేయడం తమకు ఆందోళన కలిగించే అంశమని సీతారామన్ అన్నారు.
సామర్థ్యానికి మించి అప్పులు..
అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు సామర్థ్యానికి మించి రుణం తీసుకోవాలనే ప్రలోభాలు తరతరాలుగా భారాన్ని సృష్టిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇది దేశ ఆర్థిక స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి అసాధ్యమైన, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
కేంద్రం ప్రశ్నించవచ్చు..
భారతీయ విచార్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉపన్యాస కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ.. కేంద్రం ఇలా రుణాలు తీసుకోవడంపై రాష్ట్రాలతో మాట్లాడవచ్చని అన్నారు. కేంద్రం రాష్ట్రాలను ప్రశ్నించవచ్చని వ్యాఖ్యానించారు. అయితే చాలా రాష్ట్రాలు తమ అధికార పరిధిలో ఇది జోక్యంగా భావిస్తాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలను చెడగొట్టేలా తప్పుడు రాజకీయ చర్చలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని నిర్మలా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.