రోల్స్ కారు, గడియారం, పేయింటింగ్స్: వేలానికి నీరవ్ మోడీ విలాసవంత వస్తువులు
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14 వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్ మోడీకి చెందిన విలాస వస్తువులు వేలానికి రానున్నాయి. అరుదైన పెయింటింగ్స్, చేతి గడియారాలు, లగ్జరీ కార్లు ఇలా 112 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తరఫున శాఫ్రోనార్డ్ అనే సంస్థ వేలం వేయనుంది. మార్చి 5వ తేదీన ప్రత్యక్ష వేలం ఉంటుంది. మరో 72 వస్తువులకు మార్చి 3, 4 తేదీల్లో ఆన్ లైన్ ద్వారా వేలం నిర్వహిస్తుంది.
రూ.2,000 కథ ముగిసినట్లే? ATMలో క్యాసెట్ తొలగింత, బ్యాంకుల ప్రకటన!
నీరవ్ ఆస్తులు వేలం..
మొదట ప్రత్యక్ష వేలాన్ని ఈ నెల 27న నిర్వహించాలని నిర్ణయించింది. ఈడీ నుండి వచ్చిన ఆదేశాలతో మార్చి 5వతేదీకి మార్చినట్లు శాఫ్రోనార్డ్ తెలిపింది. రేర్ పేయింటింగ్స్, ఖరీదైన రిస్ట్ వాచీలు, లగ్జరీ కార్లు వేలానికి ఉన్నాయి. లగ్జరీ వస్తువులు కొనేందుకు డిమాండ్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు.
వేలంలో ఇవన్నీ...
1935 సంవత్సరానికి చెందిన అమృత షేర్ గిల్ వేసిన పెయింటింగ్ బోయ్స్ విత్ లెమన్స్ అధికంగా రూ.12 కోట్ల నుండి 18 కోట్లు పలుకుతుందని అంచనా. ఎంఎఫ్ హుస్సేన్ వేసిన 1972 నాటి పెయింటింగ్ను కూడా వేలం వేస్తున్నారు. దీని ధర కూడా భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. వీఎస్ గైతోండే, మంజీత్ బావా, రాజా రవివర్మ పెయింటింగ్స్ వేలంలో ఉన్నాయి.
ఒక్కో వాచీకి రూ.70 లక్షలు..
అరుదైన జాగెర్ లీకౌట్లర్ మెన్స్ రెవెర్సో గైరోటర్బిల్లాన్ 2 లిమిటెడ్ ఎడిషన్ చేతి గడియారానికి రూ.70 లక్షలు వస్తుందని అంచనా. పటేక్ ఫిలిప్ నాటిలస్ గోల్డ్, డైమండ్ రిస్ట్ వాచ్కూ రూ.70 లక్షల వరకు వస్తుందని అంచనా.
రోల్స్ రాయిస్ గోస్ట్ కారు..
రోల్స్ రాయిస్ గోస్ట్కు రూ.95 లక్షలు వస్తుందని అంచనా. బిడ్డింగ్లో దీని వైపు చాలామంది మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కు బాగుంటుంది. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా వేలంలో ఉన్నాయి.