భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, రూపాయి బలహీనం: రిలయన్స్కు జియో-సిల్వర్ లేక్ షాక్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత పది పదిహేను సెషన్లుగా మార్కెట్లు ఎక్కువగా లాభాల్లో కొనసాగాయి. నెల రోజుల గరిష్టానికి కూడా చేరుకున్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 1,335.15 పాయింట్లు లేదా 3.96% నష్టపోయి 32,382.47 వద్ద, నిఫ్టీ 384.95 పాయింట్లు లేదా 3.90% నష్టపోయి 9,474.95. వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇండియన్ రూపాయి 63 పైసలు పడిపోయి 75.73 వద్ద ట్రేడ్ అయింది. గురువారం రూపాయి 75.10 వద్ద క్లోజ్ అయింది.
రెడ్జోన్ ఎఫెక్ట్, భారీగా పెరగనున్న బ్యాడ్ లోన్స్: లాక్డౌన్.. పులిమీద స్వారీయే
మార్కెట్ నష్టానికి కారణాలు కొన్ని..
లాక్ డౌన్ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. అంతేకాదు, ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే చైనా - అమెరికా మధ్య తిరిగి వాణిజ్య యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాపై టారిఫ్ పెంచే అవకాశాలు పరిశీలిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇది కూడా మార్కెట్ను దెబ్బతీసింది.
జియోలో సిల్వర్ లేక్ పెట్టుబడులు
జియో ప్లాట్ ఫామ్స్లో సిల్వల్ లేక్ పెట్టుబడులు పెట్టనుందనే వార్తల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఓ దశలో 3 శాతం కుంగిపోయాయి. E మధ్యాహ్నం గంటలు 11.30 సమయానికి 1.70 శాతం కుంగిపోయింది. రిలయన్స్ వచ్చే ఏడాది నాటికి డెబిట్ లెస్ కంపెనీగా నిలవాలని భావిస్తోంది. అదే సమయానికి సెన్సెక్స్ 1,749 పాయింట్లు కోల్పోయి 31,968 వద్ద ట్రేడ్ అయింది.
నష్టాల్లోనే అన్ని రంగాలు
టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, టాటా మోటార్స్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. కేవలం ఫార్మా రంగం మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి.