ఉద్యోగులకు అలర్ట్: ఏప్రిల్ నుండి టేక్-హోం శాలరీలో కోత! ఎందుకు.. లాభమా.. నష్టమా?
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22 నుండి ఉద్యోగులకు లభించే నికర వేతనాలలో కోతపడే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన న్యూవేజ్ రూల్ డ్రాఫ్ట్ ప్రకారం ఇకపై అలవెన్స్ల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్ శాలరీని 50 శాతంగా నిర్ణయించాలి. 2019 కొత్త వేతన నిబంధనలకు గత ఏడాది పార్లమెంటు ఆమోదం లభించింది. ఇది వచ్చే ఏడాది నుండి అమలయ్యే అవకాశాలున్నాయి. దీంతో కంపెనీలు పే-ప్యాకేజీలో సవరణలు చేపట్టే పరిస్థితులు నెలకొన్నాయి. తత్ఫలితంగా టేక్-హోం శాలరీ తగ్గవచ్చు.
కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో ఇవి పాటించండి
ఇదీ నిబంధన
కొత్త వేతన నిబంధనల డ్రాఫ్టు ప్రకారం కంపెనీలు పే-ప్యాకేజీని పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఉద్యోగుల చేతికి వచ్చే వేతనం వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి తగ్గవచ్చునని అంటున్నారు. ఈ నిబంధన ప్రకారం ఉద్యోగి మొత్తం వేతనంలో కాంపెన్షేషన్ 50 శాతం దాటవద్దు. అంటే బేసిక్ శాలరీ కనీసం 50 శాతంగా ఉండాలి.
టేక్ హోం శాలరీ తగ్గి.. రిటైర్మెంట్ కార్పస్ పెరుగుతుంది
కాంపెన్షేషన్ 50 శాతం మించవద్దంటే బేసిక్ శాలరీ కనీసం యాభై శాతంగా ఉండాలంటే.. యాజమాన్యాలు ఉద్యోగుల వేతనాలు పెంచాల్సి ఉంటుంది. అలా అయితే గ్రాట్యుటీ పేమెంట్స్, ప్రావిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. అప్పుడు ఉద్యోగుల టేక్ -హోం శాలరీ తగ్గుతుంది. అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ కార్పస్ మాత్రం పెరుగుతుంది.
ఉద్యోగుల వేతనాలపై ప్రభావం
ప్రస్తుతం ప్రయివేటు కంపెనీలు నాన్-అలవెన్స్ వేతనం 50 శాతం కంటే తక్కువ, అలెవెన్స్ భాగం 50 శాతం కంటే ఎక్కువగా ఉండేలా చూస్తున్నాయి. కొత్త వేతన నిబంధనలు అమల్లోకి వస్తే ఇది మారుతుంది. సాధారణంగా అదిక భత్యాలు పొందే ప్రయివేటురంగ ఉద్యోగుల వేతనాలపై ఇది ప్రభావం చూపుతుంది.
ఇలా ప్రయోజనమే...
కొత్త వేతన నిబంధనల వల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గినప్పటికీ, ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కొత్త వేతన నిబంధన ప్రకారం నాన్-అలవెన్స్ వాటా 50 శాతానికి పెంచితే కంపెనీలకు 10 శాతం నుండి 12 శాతం మేర ఉద్యోగ వ్యయాలు పెరగవచ్చు. తుది నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది.