ఆంక్షల్లేవు.. హానీలేదు: కొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు
కొత్త ఆదాయపు పన్ను విధానంపై చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త పన్ను విధానంతో పాటు పాత పన్ను విధానం కూడా అమలులో ఉంటుంది. ఏది ఎంచుకోవాలనేది ట్యాక్స్ పేయర్కే వదిలేశారు. కేంద్ర రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే సోమవారం మరోసారి దీనిపై స్పందించారు.
కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ ఎంచుకుంటే మీరు ఏం కోల్పోతారంటే?
వారికి ఎంతో ప్రయోజనం..
వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టడం ఆసక్తి లేని వారికి, అలా పెట్టకుండా ట్యాక్స్ సేవ్ చేసుకోలేని వారికి కొత్త పన్ను విధానం ప్రయోజనకరమని అజయ్ భూషణ్ అన్నారు. ఈ పన్ను విధానం వల్ల ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు. ఏ విధానం ప్రయోజనకరం, ఏది కాదని తాము చెప్పడం లేదని, ఆ విషయం ఐటీ చెల్లింపుదారులే నిర్ణయించుకోవాలన్నారు.
ఆంక్షలు లేవు... ఎవరికీ హానీ చేయదు
ఇందుకు ఎలాంటి ఆంక్షలు కూడా పెట్టడం లేదని అజయ్ భూషణ్ తెలిపారు. కొత్త విధానం ఎవరికీ హాని చేయదని అదే సమయంలో కొందరికి మాత్రం ప్రయోజకరంగా ఉంటుందని చెప్పారు. ఒక్కరు కూడా ఈ కొత్త విధానంతో నష్టపోరు అని చెప్పారు. పెట్టుబడులు పెట్టడం ఇష్టంలేని వారికి కాస్త ఊరట అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.
నలభై శాతం మందికి ప్రయోజనకరం
పాత, కొత్త పన్ను విధానాలలో ఎవరికి ఏది మేలు అనుకుంటే దానిని ఎంచుకునే అవకాశముందని చెప్పారు. ఇందులో గందరగోళానికి తావు లేదన్నారు. ఆదాయపు పన్ను చెల్లిం చే వారిలో దాదాపు నలభై శాతం మందికి కొత్త విధానం ఎక్కువ ప్రయోజనకం చేకూర్చే అవకాశముందన్నారు. LIC, HRA వంటి సౌకర్యం లేని చిన్న వ్యాపారులు, దుకాణాల యజమానులకు కొత్త స్లాబ్ విధానం ప్రయోజకరమన్నారు.
వారిపై ఈ ప్రభావం
పూర్తి పన్ను మినహాయింపు ఉండే పీఎఫ్, ఈపీఎఫ్, సూపర్యాన్యుయేషన్ ఫండ్స్లో ఉద్యోగుల వార్షిక కాంట్రిబ్యూషన్ రూ.7.5 లక్షలకు పరిమితం చేయడంపై స్పందిస్తూ.. దీని ప్రభావం వార్షిక వేతనం రూ.60 లక్షలకు పైన ఉన్న ఉద్యోగులపై ఉంటుందని చెప్పారు.