ఎలాన్ మస్క్ కొత్త సోషల్ మీడియా వేదిక రాబోతుందా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫాంను తీసుకు రానున్నారా? అంటే కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్లో ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఎలాన్ మస్క్ కొత్త సోషల్ మీడియాను నిర్మించడంపై ఆలోచిస్తారా, వాక్ స్వాతంత్రంతో పాటు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకు అవకాశముండి, తక్కువ అసత్య ప్రచారాలకు ఆస్కారం ఉండే వేదికను అందుబాటులోకి తీసుకు రండి, అలాంటి వేదిక అవసరం అని ప్రణయ్ అనే ఫాలోవర్ అడిగారు. దానికి మస్క్ స్పందిస్తూ.. దీనిపై తాను తీవ్ర ఆలోచన చేస్తున్నానన్నారు.
వాక్ స్వాతంత్రం సూత్రాలను విస్మరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచి వేస్తున్నారని గతంలో పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికలపై ఎలాన్ మస్క్ విరుచుకు పడ్డారు. ఇటీవల ట్విట్టర్ ద్వారా పోల్ నిర్వహించారు. ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పని చేయాలంటే స్వేచ్ఛగా మాట్లాడటం ముఖ్యమని, ట్విట్టర్ ఈ నియమానికి కట్టుబడి ఉందని మీరు భావిస్తున్నారా అని పోల్ నిర్వహించారు.
ఈ పోల్లో 20,35,924 మంది పాల్గొనగా, 70.4 శాతం మంది లేదు అని, 29.6 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. పోల్ ఫలితాలు చాలా ముఖ్యమని, జాగ్రత్తగా సమాధానం చెప్పాలని కూడా అన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ తమ గళాన్ని అణగదొక్కుతున్నాయని చాలామంది ఆరోపిస్తున్నారు.