కొత్త ప్రైవసీ పాలసీ: వాట్సాప్, ఫేస్బుక్ను నిషేధించాలని డిమాండ్
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని గట్టిగా వ్యతిరేకిస్తోంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ద్వారా యూజర్ పర్సనల్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్స్, లొకేషన్, ఇతర సమాచారాన్ని సేకరించడం పట్ల CAIT) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాట్సాప్ కొత్త నిబంధనలను అమలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్కు లేఖ రాసింది.
ఈ నిబంధనలు అమలు చేయకుండా చూడాలని లేదా వాట్సాప్, ఫేస్బుక్ను నిషేధించాలని కోరింది. కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు వ్యక్తి యొక్క గోప్యతను ఆక్రమించడం, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని CAIT కోరినట్లు ఈ ట్రేడర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు బిసి భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విజ్ఞప్తి చేశారు.
దేశంలో 200 మిలియన్లకు పైగా ఫేస్బుక్ను ఉపయోగిస్తున్నారు. ఒక సంస్థ ప్రతి యూజర్ డేటాను యాక్సెస్ చేయటం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా దేశ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని CAIT ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పును మాత్రమే అమ్మడానికి మన దేశంలోకి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత దేశాన్ని ఆక్రమించిన రోజులను ఇది గుర్తు చేస్తోందని, అయితే ప్రస్తుత సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణం మొదలైన వాటి వెన్నెముకను నాశనం చేయడానికి ఇది వారికి చాలా కీలకమైన డేటా అని తెలిపింది.