నెట్ డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ 68% జంప్, జీఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23వ తేదీ వరకు నెట్ డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం 68 శాతం పెరిగి రూ.6.92 లక్షల కోట్లకు చేరుకుంది. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఏప్రిల్ 1 నుండి 23 నవంబర్ 2021 వరకు ఏడాది ప్రాతిపదికన 67.93 శాతం ఎగిసి రూ.6,92,833.6 కోట్లకు చేరుకుందని కేంద్రమంత్రి తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 27.29 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి నవంబర్ 23 వరకు రూ.4.12 లక్షల కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి నవంబర్ 23 వరకు రూ.5.44 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.
గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లు (రీఫండ్స్ అడ్జెస్టింగ్ కంటే ముందు) నవంబర్ 23వ తేదీ నాటికి రూ.8.15 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 48.11 శాతం వృద్ధి.
ఇక, ఏప్రిల్ 2021 నుండి జీఎస్టీ కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నాటికి రూ.11.36 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి ఇప్పటికే రూ.8.10 లక్షల కోట్లు వసూలయినట్లు తెలిపారు.