వర్క్ ఫ్రమ్ హోం.. షేర్లలో భారీ పెట్టుబడులు: కానీ ముందు ఇలా చేయండి... సెబి చైర్మన్ సూచన ఇదీ?
కార్పోరేట్ బాండ్ మార్కెట్ని అభివృద్ధి చేయాల్సిన అవసరంఉందని, ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్తో అనుసంధానం చేయాల్సి ఉదని సెబి చైర్మన్ అజయ్ త్యాగి అన్నారు. ఆయన బుధవారం ఫిక్కీ 17వ యాన్యువల్ కేపిటల్ మార్కెట్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కార్పోరేట్ బాండ్ మార్కెట్ మన దేశంలో టాప్ రేటెడ్ బాండ్స్కు మాత్రమే పరిమితమైనట్లు చెప్పారు. 97 శాతం బాండ్ ట్రేడింగ్ అలాగే ఉందన్నారు.
కరోనా వ్యాక్సీన్ త్వరగా వచ్చినా లాభం లేదు: ఆర్థిక వ్యవస్థపై రఘురాం రాజన్
లాక్ డౌన్ తర్వాత ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరిగింది
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ విధించిన తర్వాత స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరిగిందని అజయ్ త్యాగి అన్నారు. ఈ పరిమాణంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ఈక్విటీలు లాంటి నష్టభయం ఎక్కువగా ఉండే వాటిలో కంటే ప్రభుత్వ బాండ్స్లలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. కార్పోరేట్ బాండ్స్లో 2013-14లో రూ.15 ట్రిలియన్ల నుండి 2019-20 నాటికి రూ.33 ట్రిలియన్లకు పెరిగినట్లు తెలిపారు. చిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రయాణం ప్రభుత్వ సెక్యూరిటీలతో ప్రారంభం కావడమే సముచితమన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్.. షేర్లలో భారీగా పెట్టుబడులు
బాండ్స్ను డీమ్యాట్ రూపంలో జారీ చేయాలని త్యాగి సూచించారు. అప్పుడే ప్రభుత్వ బాండ్స్లో చిన్న ఇన్వెస్టర్లు సులువుగా పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇతర పెట్టుబడి మార్గాలు లేకపోవడంతో మార్చి తర్వాత నుండి ఈక్విటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం భారీగా పెరిగిందన్నారు. ఏప్రిల్ తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో షేర్ల ట్రేడింగ్ వైపు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగిందన్నారు.
ఆ బాధ్యత సంస్థలది
జూన్ నెలలో కొత్తగా మొత్తం 10 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరిచారని తెలుస్తోందని, కరోనా వ్యాప్తికి ముందు ఉన్న నెలవారీ సగటు 5 లక్షలకు ఇది రెట్టింపు అని త్యాగి అన్నారు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ వైపు చూసేవారు ఈక్విటీల కంటే ప్రభుత్వరంగ పెట్టుబడుల ద్వారా ప్రయాణం సాగించడం మంచిదని సూచించారు. ఈక్విటీ మార్కెట్లలో చిన్న ఇన్వెస్టర్లు క్రమంగా భారీగా పెరుగుతున్నారని, అయితే ఎప్పటికప్పుడు సమాచార వెల్లడి ద్వారా వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత కార్పోరేట్ సంస్థలపై ఉందన్నారు.
నమ్మకం అలాగే ఉంచుకోవాలి
చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్ను విశ్వసిస్తున్నారని, ఆ నమ్మకం పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన అవసరం, ఆవశ్యత ఉందన్నారు. మార్చి నెలలో కరోనా కారణంగా మార్కెట్ భారీగా పడిపోయిందని, మే తర్వాత క్రమంగా పుంజుకుంటోందని, దీంతో మూలధన సమీకరణ పెరిగిందని, ఇది మంచి పరిణామం అన్నారు. లాక్ డౌన్ సమయంలో బ్రోకర్లు ఇంటి నుండి పని చేశారని, ఇది విజయవంతమైందన్నారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారమే అన్నారు.