వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల సంఖ్య 75,000
భారత్ సంచార్ నిగమ్ (BSNL)కు చెందిన దాదాపు 75,000 మంది వీఆర్ఎస్ స్కీంకు దరఖాస్తు చేసుకున్నారని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ గురువారం తెలిపారు. వీఆర్ఎస్ స్కీంకు దాదాపు లక్ష మందికి వరకు ఉద్యోగులు అర్హులు. దాదాపు 80 వేల మంది వరకు దీనిని ఎంచుకుంటారని భావించారు. అయితే ఈ స్కీం వచ్చిన రెండు వారాల్లోనే ఏకంగా 75వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీలో 1.50 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు.
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ ఆఫర్: కథనాలు
వీఆర్ఎస్ దరఖాస్తుకు డిసెంబర్ 3, 2019 వరకు గడువు ఉంది. నవంబర్ 14వ తేదీ వరకు వీఆర్ఎస్ ఎంచుకున్న ఉద్యోగుల సంఖ్య 75,000 వరకు చేరుకుందని పూర్వార్ తెలిపారు. దాదాపు 80,000 మంది ఉద్యోగుల వీఆర్ఎస్తో రూ.7000 కోట్ల మిగులు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ అంచనా వేస్తోంది.
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు VRS కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను ఫీల్డ్ యూనిట్లకు అందించామని, వారు ఉద్యోగులందరికీ ఈ వివరాలు చెబుతారని ఉన్నతాధికారులు చెప్పారు. వీఆర్ఎస్ ఆఫర్ వివరాలు వారి నుంచి తెలుసుకోవచ్చునని చెప్పారు.
BSNL వాలంటరీ రిటైర్మెంట్ స్కీం - 2019 అందరు రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులు అర్హులు. ఇతర ఆర్గనైజేషన్ల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన వారు కూడా వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 50 ఏళ్లకు పైబడిన ఉద్యోగులు దీనికి అర్హులు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న సర్వీసుకు గాను ఏడాదికి 35 రోజుల చొప్పున వేతనాన్ని, రిటైర్మెంట్ వయస్సుకు మిగిలి ఉన్న ఏళ్లకు గాను 25 రోజుల వేతనాన్ని వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా కింద కట్టి అందిస్తారు.
అలాగే, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు కూడా వీఆర్ఎస్ అమలు చేస్తోంది. వారు కూడా డిసెంబర్ 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 31, 2020 నాటికి 50 ఏళ్లు నిండేవారు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఎంటీఎన్ఎల్ నోటీసులో పేర్కొంది.