మన దేశంలో సహజవాయువు ధరలు దశాబ్దం కనిష్టానికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన ధరల సవరణలో సహజ వాయువు మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(mmBtu) ధరను 1.9 డాలర్ల నుండి 1.94 డాలర్లకు తగ్గించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ఏడాదిలో సహజవాయువు ధరను వరుసగా మూడోసారి తగ్గించినట్లవుతుంది. ఏప్రిల్ నుండి mmBtu సహజవాయువు ధర 26 శాతం తగ్గి 2.39 డాలర్లకు దిగి వచ్చింది.

ఆరునెలలకోసారి సమీక్ష... ఈసారి మరింత నష్టాలు
ఎరువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి, సీఎన్జీ, కుకింగ్ గ్యాస్ తయారీలో సహజవాయువును ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం ఆరు నెలలకోసారి సమీక్షిస్తారు. ఏప్రిల్ 1వ తేదీన, అక్టోబర్ 1వ తేదీన సహజ వాయువు ధరల్లో సవరణలు చేస్తారు. అక్టోబర్ 1వ తేదీన సహజవాయువు ధరను భారీగా తగ్గిస్తే ఓఎన్జీసీ నష్టాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.

రేటుకు ప్రామాణికం..
అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లను ప్రామాణికంగా తీసుకుంటారు. 2014 నవంబర్ నెలలో ప్రభుత్వం కొత్తగా గ్యాస్ ఫార్ములాను ప్రవేశపెట్టింది. అప్పటి నుండి దేశీయ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ పైన ఓఎన్జీసీకి నష్టాలు వస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ రేటు అంటే లాభనష్టాలు లేని ధర 5 డాలర్ల నుండి 9 డాలర్లుగా ఉంటోందని, ప్రస్తుత 2.39 డాలర్లు గిట్టుబాటు కావడం లేదని కేంద్రానికి ఓఎన్జీసీ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. గతంలో గ్యాస్ విభాగంలో నష్టాల్ని చమురు విభాగం ద్వారా కొంతలో కొంత భర్తీ చేసుకునేది ఓఎన్జీసీ. కానీ ఇప్పుడు చమురు వ్యాపారం కూడా ఒత్తిడిలో ఉంది.

ఈసారి రూ.6000 కోట్ల నష్టం!
ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పోరేషన్(ONGC) 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,272 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్-2021 మార్చి)లో రూ.6,000 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా. మే 2010లో విద్యుత్, ఎరువుల సంస్థలకు విక్రయించే గ్యాస్ రేటును 1.79 నుండి 4.20 (mmBtu) డాలర్లకు పెంచింది ప్రభుత్వం. దీంతో ఓఎన్జీసీకి ప్రతి mmBtuకు 3,818 వచ్చింది.


Click it and Unblock the Notifications