రూ.1 లక్ష కోట్లతో జాతీయ బ్యాంకు, నిర్మల ప్రకటించే ఛాన్స్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్లో భాగంగా కేంద్రం నేషనల్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లతో ఈ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ధృవీకరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఇందుకు తొలుత రూ.20వేల కోట్ల పెయిడప్ క్యాపిటల్ను సమకూర్చవచ్చునని చెబుతున్నారు. ప్రావిడెంట్, పెన్షన్, ఇన్సురెన్స్ ఫండ్ సంస్థలు తమ నిధుల్లో కొన్నింటిని తప్పనిసరిగా నేషనల్ బ్యాంకులో ఉంచేలా కేంద్రం నిర్ధేశించవచ్చునని చెబుతున్నారు.
కరోనా నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో అన్ని రంగాలు, వర్గాలకు అనుకూల ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. రియాల్టీ, ఎంఎస్ఎంఈ, ఆటో, హాస్పిటాలిటీ తదితర రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. రియాల్టీ రంగం ఉపాధి పరంగా రెండో అతిపెద్ద రంగంగా ఉంది. ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు, రియాల్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రియాల్టీ రంగానికి ఉతమిచ్చేందుకు, వినియోగదారుల డిమాండ్ పెంచడానికి చర్యలు చేపట్టవలసి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.