ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోవద్దంటే, కంపెనీలోనే ఉంటారు కానీ: ప్రభుత్వానికి కీలక సూచన
బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM), గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్స్(GICs) ఉద్యోగుల కోసం ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కాం (Nasscom) ప్రభుత్వాన్ని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోరింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్తో ఇబ్బంది పడుతున్న ఐటీ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అలాగే, బెంచ్ ఉద్యోగులకు కనీస వేతనం కోసం అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఉద్యోగాలు కాపాడేందుకు కీలక నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 50% వేతనమే
70 శాతం ఉద్యోగుల వినియోగం మాత్రమే
బెంచ్ ఉద్యోగులకు కనీస వేతనాలు మాత్రమే ఇవ్వడానికి అనుమతించడం ద్వారా BPM, GICలలో ఉద్యోగాల కోత లేకుండా నివారించవచ్చునని సూచించింది. లాక్ డౌన్ వల్ల ఈ విభాగాలు 70 శాతం మంది ఉద్యోగులను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాయి.
పూర్తి వేతనం భారం
20 శాతం మందికి ప్రాజెక్టులు లేవనుకుంటే, వీరికి పూర్తి వేతనాలు ఇవ్వడం భారంగా మారుతుందని తెలిపింది. కాబట్టి చట్టబద్ద చెల్లింపులతో పాటు కనీస వేతనాలకు అనుమతిస్తే, ఉద్యోగ కోతలు లేకుండా చూడవచ్చునని తెలిపింది.
బ్రిటన్లో 50 శాతం వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది
కంపెనీ జాబితాలో ఉద్యోగిగా పేరు ఉన్నప్పటికీ, లాక్ డౌన్ కాలానికి వేతనం లేకుండా కొనసాగించేలా బ్రిటన్ తరహా పథకం ప్రవేశ పెట్టాలని కోరింది. అంటే ఉద్యోగులు కంపెనీలోనే ఉంటారు. కానీ బెంచ్పై ఉన్నందుకు వేతనం తీసుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్లో ప్రభుత్వమే ఉద్యోగికి 50 శాతం వేతనం చెల్లిస్తోందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ నుండి ఎలాంటి వేతనం లేదా సహకారం లేని పరిస్థితిలు ఉన్నాయని తెలిపింది.
పీఎఫ్ నిబంధన అందరికీ వర్తింప చేయండి
పీఎఫ్ వాటాను సంస్థలు చెల్లించకుండా ఇచ్చిన నిబంధనల్లో 100 మంది ఉద్యోగులు, 90 శాతం మంది వేతనం రూ.15,000 అనే షరతును తొలగించాలని కోరింది. దీనిని అందరికీ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఉద్యోగాలు పోవద్దంటే..
ఏప్రిల్ 15 రోజున లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాస్కాం స్పందిస్తూ.. ముందే ఈ అంశాలను పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కోరింది. BPM/GIC, ఐటీ ఇండస్ట్రీలో దాదాపు 70 శాతం మాత్రమే పని చేస్తున్నారని, 20 శాతం ఇంటికే పరిమితమయ్యారని, వేతన పరంగా ఇది చాలా పెద్ద సంఖ్యే అని ఆందోళన వ్యక్తం చేసింది.
IT/BPM 40 మిలియన్ల మంది ఉద్యోగులు
IT/BPM పరిశ్రమలో 40 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఒక మిలియన్ మంది BPM సెగ్మెంట్లో ఉన్నారు. ఫైనాన్స్, అకౌంటింగ్, పేరోల్, హెచ్ఆర్, సప్లై చైన్, లీగల్ తదితర సేవలు అందిస్తాయి.
ప్యాకేజీ...
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోతే GICలలో సేవలు కూడా తగ్గిపోతాయని నాస్కాం తెలిపింది. కంపెనీల్లోని నాలుగు లక్షలమంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది బేసిక్ పే రూ.12,000 వరకు ఉంటుందని తెలిపింది. అంటే ప్రభుత్వం, ఐటీ ఇండస్ట్రీ నుండి ఉద్యోగుల కోసం రూ.480 కోట్లతో ప్యాకేజీ అవసరమని తెలిపింది.