Myntra: సీఈఓ అమర్ నాగారం గుడ్బై: సొంత ఇ-కామర్స్ ప్లాట్ఫామ్
బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీగా గుర్తింపు పొందిన బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ మింత్రా. ఫ్లిప్కార్ట్కు అనుబంధంగా కొనసాగుతోందీ ఇ-కామర్స్ కంపెనీ. మింత్రాకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పని చేస్తోన్న అమర్ నాగారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్లిప్కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తికి పంపించారు.
అమర్ నాగారం రాజీనామా చేసిన విషయాన్ని కల్యాణ్ కృష్ణమూర్తి నిర్ధారించారు. అమర్ నాగారం మింత్రాను వీడారనే సమాచారాన్ని అధికారికంగా ఇ-మెయిల్ ద్వారా సంస్థ ఉద్యోగులకు తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆయన సీఈఓ హోదాలోనే కొనసాగుతారని పేర్కొన్నారు. ఈలోగా మింత్రా సీఈఓ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ తరువాత కూడా అమర్ నాగారం మింత్రతో అసోసియేట్ అయి ఉంటారని తెలుస్తోంది. ఓ అడ్వైజర్గా వ్యవహరిస్తారని చెబుతున్నారు.
అమర్ నాగారం.. మూడేళ్లుగా మింత్రా సీఈఓగా పని చేస్తోన్నారు. 2019లో ఆయన మింత్రా, ఝబాంగ్ సీఈఓగా అపాయింట్ అయ్యారు. అంతకుముందు ఫ్లిప్కార్ట్ వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు. మింత్రాను ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసిన తరువాత.. దానికి సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఇండిపెండెంట్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్గా ఉంటూ వచ్చింది మింత్రా. అనంతరం ఫ్లిప్కార్ట్ దీన్ని కొనుగోలు చేసింది. 2000 కోట్ల రూపాయలతో వందశాతం స్టేక్స్ను తీసుకుంది.
అప్పటి నుంచి ఫ్లిప్కార్ట్కు అనుబంధంగా కొనసాగుతోంది. ఫ్లిప్కార్ట్ దీనికి ప్రమోటర్గా వ్యవహరిస్తోంది. సొంతంగా ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ను నెలకొల్పాలనే ఉద్దేశంతోనే అమర్ నాగారం ఫ్లిప్కార్ట్ నుంచి బయటికి వచ్చారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. సుమారు 10 సంత్సరాలుగా ఆయన మింత్రాతో అసోసియేట్ అయి ఉన్నారు. బిజినెస్ హెడ్ వంటి కీలక హోదాల్లో పని చేశారు. మూడేళ్ల కిందట సీఈఓగా అపాయింట్ అయ్యారు.
ఇటీవలి కాలంలో ఇ-కామర్స్ సంస్థకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోండటాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా సొంతంగా ఓ వెంచర్ను ప్రారంభించాలనే ఉద్దేశంతో అమర్ నాగారం తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. 10 సంవత్సరాల అనుభవంతో కొత్త వెంచర్ కోసం ఆయన సన్నాహాలు చేస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయని మరో ఆరు నెలల్లో ఈ వెంచర్ మనుగడలోకి రావొచ్చని తెలుస్తోంది.