బ్యాడ్ బ్యాంకులు చాలానే కావాలి: ఉదయ్ కొటక్, నిర్మలమ్మకు CII విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో ఎన్పీఏలు భారీగా పేరుకుపోయాయని, వీటి ప్రభావం తగ్గాలంటే బ్యాడ్ బ్యాంకులు తప్పనిసరి అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(CII) తెలిపింది. బ్యాడ్ బ్యాంకులను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రీ-బడ్జెట్ విజ్ఞప్తుల్లో భాగంగా సీఐఐ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఇందులో భాగంగా ఎన్పీఏలు తగ్గడానికి పలు బ్యాడ్ బ్యాంకులు అవసరం అని తెలిపింది. అప్పుడే బ్యాలెన్స్ షీట్ల ప్రక్షాళన సాధ్యమని తెలిపింది. రుణవృద్ధి కూడ మెరుగవుతుందని పేర్కొంది.
క్రెడిట్ సైకిల్ గాడిన పడుతుంది
కరోనా మహమ్మారి తర్వాత మార్కెట్ నిర్ణయించిన ధరల ఆవిష్కరణల ద్వారా పరిష్కార యంత్రాంగాన్ని కనుక్కోవడం ఎంతో ముఖ్యమని, దేశఈయంగా, అంతర్జాతీయంగా భారీ ద్రవ్య లభ్యత కలిగిన సంస్థల సహాయంతో పలు బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తే సమస్యను పారదర్శకంగా పరిష్కరించే అవకాశం ఉందని సీఐఐ అధ్యక్షులు ఉదయ్ కొటక్ అన్నారు. దీంతో బ్యాంకు బ్యాలెన్స్ షీటు కూడా ప్రక్షాళన అవడంతో పాటు క్రెడిట్ సైకిల్ గాడిన పడుతుందన్నారు.
బ్యాడ్ బ్యాంక్ అనివార్యమని..
2017 ఆర్థిక సర్వేలోనే ఒత్తిడిలోని రుణాల పరిష్కారానికి ప్రభుత్వరంగ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ పేరుతో బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. బ్యాంకులకు మొండి బాకీలు పెరిగిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బ్యాండ్ బ్యాంక్ ఏర్పాటు తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు కూడా భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సహా పలువురు గతంలోనే బ్యాడ్ బ్యాంకులు ఉండాలన్నారు. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు తప్పనిసరి మాత్రమే కాదని, అనివార్యమని దువ్వూరి నాలుగు నెలల క్రితం వ్యాఖ్యానించారు.
మూలధన సాయం
ప్రభుత్వరంగ బ్యాంకులకు నిరర్థక ఆస్తులు పెరగడంతో మూలధన సాయం కింద ప్రభుత్వం ఎప్పటికి అప్పుడు వీటికి నిధులు సమకూర్చవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. 2017-18లో రూ.80,000 కోట్లు, 2018-19లో రూ.1.08 లక్షల కోట్లు, 2019-20లో రూ.70,000 కోట్ల మూలధన సాయం అందించింది. గత సెప్టెంబర్ నెలలోను ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.20,000 కోట్ల మూలధన సాయం కోసం పార్లమెంట్ ఆమోదం లభించింది.