మరోసారి ముఖేశ్ అంబానీ ‘టారిఫ్ వార్’.. గిగాఫైబర్ బేస్ ధర తగ్గింపు!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి 'టారిఫ్ వార్'కి తెరలేపారా? అంటే అవును అనే అనిపిస్తోంది. కాకపోతే ఈసారి టారిఫ్ వార్ వాయిస్ కాలింగ్, డేటాల విషయంలోకాదు, బ్రాడ్బ్యాండ్ సెక్టార్లో. అవును, త్వరలోనే జియో గిగాఫైబర్ నెలవారీ ప్లాన్ ధర 50 శాతం తగ్గనుంది.
ఇప్పటికే బ్రాడ్బ్యాండ్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఎయిర్టెల్ను చావుదెబ్బ తీసే లక్ష్యంతో రంగంలోకి దిగిన జియో గిగాఫైబర్ నెలకు కేవలం రూ.699కే బ్రాడ్బ్యాండ్తోపాటు వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీంతో జియో తాజాగా గిగాఫైబర్ బేస్ రేటును దాదాపు సగానికి తగ్గించి మరోసారి తన ప్రత్యర్థులకు సవాల్ విసరనుంది.
అదే రిలయన్స్ జియో స్టయిల్...
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2016లో జియో పేరుతో టెలికాం కంపెనీని ప్రారంభించినప్పుడు.. జనమంతా జియో సిమ్ కార్డుల కోసం క్యూ కట్టారు. దాదాపు నెల రోజులపాటు దేశ వ్యాప్తంగా జియో స్టోర్ల ఎదుట ఎప్పుడు చూసినా విపరీతమైన రద్దీ కనిపించేది. సిమ్ కార్డు దొరికితే పండగే అన్నట్లు ఉండేది పరిస్థితి. మొదట జియో తన సేవలను ఉచితంగా ఇచ్చింది. ఆ తరువాత కూడా చౌక ధరలకే మొబైల్ కాలింగ్, డేటా సేవలు అందించడంతో జియోకు డిమాండ్ తగ్గలేదు.
బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించినా...
ఆ తరువాత జియో గిగాఫైబర్ పేరుతో బ్రాండ్ బ్యాండ్ సేవలను ప్రకటించినప్పుడ కూడా జనంలో మరింత ఉత్సాహం కనిపించింది. కొన్ని నెలలపాటు ఈ సేవలను కూడా జియో ఉచితంగానే ఇచ్చింది. మూడు నెలల క్రితం బ్రాండ్ బ్యాండ్ సేవలకు టారిఫ్ ప్రకటించిన తరువాత మాత్రం జనం కొంత నిరుత్సాహ పడ్డారు. దీనికి కారణం గిగాఫైబర్ కనీస టారిఫ్ రూ.699 నుంచి మొదలుకావడమే.
జాగ్రత్త పడిన ప్రత్యర్థి కంపెనీలు...
అప్పటికే బ్రాండ్ బ్యాండ్ రంగంలో సేవలు అందిస్తోన్న జియో ప్రత్యర్థి కంపెనీలు ఎయిర్టెల్, యాక్ట్, హాత్వేల టారిఫ్లు కూడా తొలుత దాదాపు జియో మాదిరిగానే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే జియో మార్కెట్లోకి వస్తుందని తెలిసిందే, అంతకంటే ముందే ఇవి నెలవారీ ప్లాన్ల ధరలను మరింత తగ్గించాయి. యాక్ట్ ఫైబర్ అయితే నెలకు రూ.450కే 40 ఎంబీపీఎస్ వేగంతో బ్రాండ్ బ్యాండ్ సేవలు అందిస్తోంది. జియో గిగాఫైబర్ ఆరంగేట్రంతో హాత్వే కూడా తన టారిఫ్లను మరింత తగ్గించింది.
రూటు మార్చిన జియో...
జియో గిగాఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్తోపాటు వాయిస్ కాలింగ్ సేవలనూ అందిస్తున్నా.. టారిఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రజల నుంచి డిమాండ్ పెద్దగా లభించలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జియో తాజాగా గిగాఫైబర్ సేవల బేస్ టారిఫ్ను రూ.351కి తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జియోకు చెందిన ఓ అధికారి ఒకరు దీనిపై వివరణ ఇస్తూ.. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లోనూ తాము తెలిపామని చెప్పారు.
బేస్ ధర తగ్గింపు ప్లస్ అదనపు డేటా...
గిగాఫైబర్ ప్లాన్లు మాత్రం రూ.699 నుంచే మొదలవుతాయని తెలుస్తోంది. కాకపోతే ప్రతి ప్లాన్కు రూ.351 బేస్ ధరగా ఉంటుంది. రూ.699 ప్లాన్లో నెలకు 150 జీబీ చొప్పున హైస్పీడ్ డేటా ఇస్తారు. ఈ మొత్తం అయిపోయాక బ్రాడ్బ్యాండ్ వేగం 1 ఎంబీపీఎస్కు తగ్గుతుంది. అలాంటి సమయంలో అదనంగా డేటా పొందడానికి రూ.234 ప్రీపెయిడ్ ఓచర్ కూడా జియో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వోచర్ ద్వారా వినియోగదారులు వారం రోజులపాటు అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చని జియోకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.
2 కోట్ల యూజర్లే లక్ష్యంగా జియో...
మన దేశంలో ప్రస్తుతం బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య రెండు కోట్లు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య 23.5 లక్షలు. నిజానికి ఇంతమంది యూజర్లను సంపాదించుకోవడానికి ఎయిర్టెల్కు చాలా ఏళ్లు పట్టాయి. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి జియో బ్రాడ్ బ్యాండ్ ఖాతాదారుల సంఖ్య ఏడు లక్షలు. అయితే జియో ఈ సంఖ్యను 2 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలా క్రమంగా దేశ వ్యాప్తంగా తన గిగాఫైబర్ యూజర్ల సంఖ్యను5 కోట్లకు పెంచుకోవాలనేది జియో టార్గెట్.
అందుకేనా ఈ ‘టారిఫ్ వార్’?
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. అంత పెద్ద సంఖ్యలో యూజర్లను తన పరం చేసుకోవడం జియోకు కష్టసాధ్యమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ప్రస్తుతం జియో బ్రాడ్బ్యాండ్ టారిఫ్ అని, తన నెలవారీ ప్లాన్ ధరలను జియో మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని వారు వాదిస్తున్నారు. నెలవారీ టారిఫ్ తగ్గించకపోతే బ్రాడ్బ్యాండ్ రంగంలో వృద్ధి కూడా ఎక్కువగా ఉండదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జియో లక్ష్యం నెరవేరాలంటే బ్రాడ్బ్యాండ్ సేవల విస్తరణను పెంచి టారిఫ్లు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.