6 నెలలుగా ముఖేష్ అంబానీ సంపద గంటకు రూ.90 కోట్లు: టాప్ 10 వీరే, మహిళల్లో ఎవరంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో ఎంత సంపాదించారో తెలుసా? లాక్ డౌన్ నుండి ఈ ఆసియా కుబేరుడు ప్రతి గంటకు రూ.90 కోట్లు ఆర్జించారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో వరుసగా 9వసారి అంబానీ టాప్లో నిలిచారు. ఈ కాలంలో ఆయన సంపద రూ.2,77,000 కోట్ల నుండి రూ.6,58,000 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ రిలయన్స్ వ్యాల్యూ భారీగా పెరిగింది.
8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.57 లక్షల కోట్లు డౌన్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ జూమ్
73% పెరిగిన ముఖేష్ సంపద, మహిళల్లో స్మిత వీ కృష్ణ
ఆగస్ట్ 31వ తేదీతో ముగిసిన 12 నెలల కాలంలో ముఖేష్ అంబానీ సంపద 73 శాతం పెరిగింది. దీంతో ఆయన సంపద రూ.6.58 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో రూ.1,000 కోట్లకు మించి సంపద ఉన్న 828 మందిని పరిశీలించారు. ఇందులో 627 మంది సంపద పెరిగింది. 229 మంది సంపద తగ్గింది. గతంలో చోటు దక్కించుకున్న 75 మంది ఈసారి చోటు దక్కించుకోలేకపోయారు. ఈ జాబితాలో కొత్తగా 162 మంది చోటు దక్కించుకున్నారు. 90 శాతం మంది ఫ్యామిలీ నుండి వచ్చారు. పురుషుల్లో ముఖేష్ అంబానీ ఆదాయంలో మొదట నిలిస్తే, మహిళల్లో స్మితా వి క్రిష్ణ రూ.32,400 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు.
టాప్ 10లో ఎవరి సంపద ఎంత పెరిగింది
- హురున్ జాబితాలో రెండో స్థానంలోని హిందూజా సోదరుల సంపద (రూ.1,43,700 కోట్లు) 23 శాతం క్షీణించింది.
- మూడో స్థానంలోని శివనాడర్, ఫ్యామిలీ (రూ.1,41,700 కోట్లు) సంపద 34 శాతం పెరిగింది.
- నాలుగో స్థానంలోని గౌతమ్ అదానీ, ప్యామిలీ (రూ.1,40,200 కోట్లు) సంపద 48 శాతం పెరిగింది.
- 5వ స్థానంలోని అజీమ్ ప్రేమ్జీ, కుటుంబం సంపద (రూ.1,14,400) 2 శాతం క్షీణించింది.
- 6వ స్థానంలోని సైరస్ పూనావాలా సంపద (రూ.94,300 కోట్లు) 6 శాతం పెరిగింది.
- 7వ స్థానంలోని రాధాకిషన్ ధమానీ, ప్యామిలీ సంపద (రూ.87,200 కోట్లు) 56 శాతం పెరిగింది.
- 8వ స్థానంలోని ఉదయ్ కొటక్ సంపద (రూ.87,000 కోట్లు) 8 శాతం క్షీణించింది.
- 9వ స్థానంలోని దిలీప్ శాంఘ్వీ సంపద (రూ.84,000 కోట్లు) 17 శాతం పెరిగింది.
- 10వ స్థానంలోని సైరస్ పల్లోంజీ మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీల సంపద (రూ.70,000 కోట్ల చొప్పున) 9 శాతం చొప్పున క్షీణించింది.
మరిన్ని అంశాలు..
- అత్యధిక సంపన్నుల్లో పురుషుల జాబితాలో ముఖేష్ అంబాని ఉండగా, మహిళల్లో స్మిత వి క్రిష్ణ ఉన్నారు.
- ముఖేష్ అంబానీ సంపద ఓ సమయంలో 28 శాతం క్షీణించింది. ఆ తర్వాత దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో 85 శాతం పెరిగింది. మొత్తంగా 73 శాతం సంపద పెరిగింది.
- బీఎస్ఈ సెన్సెక్స్లో రిలయన్స్ వాటా 2019 చివరి నాటికి 11 శాతం కాగా, ఈ ఏడాది 17.4 శాతానికి పెరిగింది.
- ఈ జాబితాలో 40 ఏళ్ల లోపు 21 మంది ఉన్నారు.
- 828 మంది ఇండివిడ్యువల్స్ సంపద రూ.60,59,500 కోట్లుగా ఉంది.
- గ్రాన్యూల్స్ ఇండియా చిగురుపాటి కృష్ణప్రసాద్ ఆస్తి ఈ ఏడాది 218 శాతం పెరిగింది. దీంతో రూ.4500 కోట్లకు చేరుకుంది.
- జాబితాలో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా ఓయో రూమ్స్ వ్యవస్థాపకులు రితేష్ అగర్వాల్ నిలిచారు. ఆయన సంపద రూ.5400 కోట్లుగా ఉంది.
అత్యధిక వయస్సు ఉన్న సంపన్నుడిగా ధర్మపాల్ గులాటీ ఉన్నారు.