ముద్రా రుణాలు.. లక్షల్లో ఉద్యోగాలు..
బ్యాంకుల నుంచి రుణాలు అందితే దాని ప్రయోజనం, ఫలితాలు ఏవిధంగా ఉంటాయో మరోసారి రుజువయింది. ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింద జారీ చేస్తున్న ముద్రా రుణాల వల్ల ఎంతో మంది చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అధికారిక సర్వే ద్వారా ముద్రా రుణాల ద్వారా ఏ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలిగాయో వెల్లడయింది.
ప్రభుత్వ నివేదిక ప్రకారం ముద్రా రుణాలు పొందడానికి ముందు వ్యాపార సంస్థలు దాదాపు 3.93 కోట్ల మందికి ఉపాధిని కల్పించాయి. అయితే ముద్రా రుణాలు పొందిన తర్వాత వీటి ఉద్యోగాల కల్పన 5.04 కోట్లకు చేరుకుంది. అంటే వృద్ధి 28 శాతంగా ఉందన్న మాట..
ఉద్యోగులకు శుభవార్త: 3% శాతం కంటే ఎక్కువగా పెరిగిన డీఏ
నాలుగేళ్ల క్రితం ప్రారంభం
* 2015 ఏప్రిల్ లో ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించారు.
* దీని కింద ఎలాంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
* ఈ రుణాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఉపాధిలో మిన్న
* ఈ పథకం ద్వారా లక్షలాది మంది స్వయం ఉపాధిని పొందగలిగారు.
* మొత్తంగా 1.12 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఇందులో 55 శాతం స్వయంగా ఉపాధి అవకాశాలను పొందిన వారున్నారు.
* 2015 నుంచి 2018 వరకు జారీ చేసిన రుణాల ద్వారా ఈ ఉద్యోగాలు లభించాయి.
* ముద్రా రుణాల ద్వారా 51 లక్షల మంది కొత్త ఎంటర్ ప్రెన్యూర్లు గా మారారు. అయితే ఈ సంఖ్య ప్రభుత్వం ఆశించిన స్థాయికన్నా తక్కువగానే ఉన్నట్టుగా చెబుతున్నారు.
మొండి పద్దులతో తంటా..
* బ్యాంకులు జారీ చేసిన ముద్రా రుణాల్లో కొంత మొత్తం మొండిపద్దులుగా మారిపోతోంది. ఇది బ్యాంకులకు ఇబ్బంది కరమైన అంశమే.
* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ముద్రా రుణాల మొండి పద్దులు (ఎన్ పీఏ) 9,200 కోట్లకు పైగానే ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2018 మార్చిలో 7,277 కోట్ల రూపాయలుండగా 2019 మార్చి లో 16,481 కోట్లు దాటినట్టు తెలుస్తోంది.
ముద్రా పథకం కింద రుణాలు భారీ స్థాయిలో జరీ చేస్తున్నప్పటికీ మొండి పద్దులు మాత్రం బ్యాంకులకు కాస్త ఆందోళన కల్గిస్తున్నాయి.