మొన్న అమూల్..ఇప్పుడు మదర్ డెయిరీ: పాలు..చాలా ఖరీదు
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం ప్రభావం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వస్తాయనే ప్రచారం దేశంలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోంది. ఈ యుధం వల్ల ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ రేటు వంద డాలర్లను దాటేసింది. ఇందులో హెచ్చుతగ్గులు నమోదవుతున్నప్పటికీ.. ఇదివరకట్లా స్థిరత్వం కనిపించట్లేదు. క్రూడాయిల్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుదల బాట పట్టొచ్చనే ప్రచారం సాగుతోంది.
వంటనూనె.. పాలు..
దీనికి ఆరంభ సూచకంగా ఇదివరకే వంటనూనెల రేట్లు కూడా భారీగా పెరిగాయి. సలసలమంటూ కాగుతున్నాయి. వంటనూనెల రేట్లల్లో లీటర్ ఒక్కింటికి 20 నుంచి 40 రూపాయల వరకు పెరుగుదల కనిపించింది. ఇప్పుడు తాజాగా పాల వంతు వచ్చింది. పాల రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే అమూల్ తన పాల ధరలను పెంచింది. ఆ తరువాత పరాగ్ మిల్క్ ఫుడ్స్ కంపెనీ కూడా అదే బాట పట్టింది. ఈ రెండు కంపెనీలు కూడా పాల ధరలను లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల వరకు పెంచాయి. ఈ నెల 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
జులై తరువాత ఇదే తొలిసారి..
పాల సేకరణ రేట్లను పెంచాల్సి రావడం వల్ల అదనంగా పడిన భారాన్ని వినియోగదారులపై నామమాత్రంగా మోపినట్లు వివరించింది. గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి వేరియంట్లు ప్రస్తుతం అమూల్లో అందుబాటులో ఉన్నాయి. అమూల్ గోల్డ్ అర లీటర్ పాల ధర 30, తాజా బ్రాండ్ అర లీటర్ 24, శక్తి అర లీటర్ 27 రూపాయలకు లభిస్తాయని తెలిపింది. అమూల్ పాల ధరలు పెరగడం ఏడు నెలల తరువాత ఇదే తొలిసారి. గత సంవత్సరం జులైలో చివరిసారిగా అమూల్ సమాఖ్య తన పాల రేట్లను పెంచింది.
మదర్ డెయిరీ వంతు..
ఇప్పడు తాజాగా మదర్ డెయిరీ కూడా పాల రేట్లను పెంచింది. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచుతున్నట్లు తెలిపింది. ఆదివారం నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయి. పాల సేకరణ, ప్యాకేజింగ్ మెటీరియల్, ఇంధన ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని మదర్ డెయిరీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం 57 రూపాయలు పలుకుతోన్న మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్డ్ లీటర్ పాలు ఆదివారం నుంచి 59 రూపాయలకు చేరుతుంది.
కొత్త రేట్లివీ..
టోన్డ్ మిల్క్-49 రూపాయలు, డబుల్ టోన్డ్ మిల్క్-43 రూపాయలు, ఆవు పాలు 51 రూపాయలు, బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) 46 రూపాయలు పలుకుతుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోనే మదర్ డెయిరీ 30 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది ప్రతి రోజూ. అమూల్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ తరువాత మదర్ డెయిరీ వాటా అధికం. అమూల్ కోటిన్నర, పరాగ్ మిల్క్ 37 లక్షల లీటర్ల మేర పాలను విక్రయిస్తోన్నాయి.