భారత IT ఇండస్ట్రీకి కరోనానే ఇప్పటి వరకు పెద్ద సవాల్, పెనుమార్పులు
ఇండియన్ ఐటీ సెక్టార్ గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన సవాళ్లను ఇప్పుడు ఎదుర్కొంటోందని ఇండస్ట్రీ నిపుణులు ఎస్ మహాలింగమ్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు లేని, ఎదుర్కోని సవాళ్లను చూస్తోందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఇండియన్ ఐటీ రంగం వినూత్న ముందుకు వస్తోందన్నారు. మహాలింగం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
అమెరికా కోసం ట్రంప్ కీలక నిర్ణయం: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ సహా 6గురు భారతీయులకు చోటు
వలస విధానం.. ప్రజల విధానంలో పెను మార్పులు
కరోనా కారణంగా జరుగుతున్న నష్టం చాలా తీవ్రమైనదని, ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అర్థమైందని, కానీ ఇప్పుడు తిరిగి ప్రపంచ వాణిజ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేయాలన్నారు. అంతర్జాతీయ వలస విధానాలు మారే అవకాశముందని, ప్రజల కదలికలు మారిపోతాయన్నారు. మొత్తానికి కరోనా కారణంగా ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయన్నారు.
దేశీయ ఐటీ కంపెనీలు సూపర్
ఎగుమతుల విషయానికి వస్తే భారత ఐటీ కంపెనీలు వినూత్న మార్గాలతో ముందుకు వచ్చాయని చెప్పారు. డెలివరీలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాయన్నారు. లాక్ డౌన్ సమయంలో ఎక్కువ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇది అసాధారణమైన విషయమన్నారు.
గతంలో చూడని పరిణామాలు
ఆసియా సంక్షోభం, Y2K, 2008-09 వంటి సంక్షోభాల నుండి కూడా ఐటీ కంపెనీలు గట్టెక్కాయని చెప్పారు. కానీ ప్రస్తుత కరోనా వీటన్నింటి కన్నా భిన్నంగా ఉందన్నారు. 1970లో ఐటీ రంగంలో అడుగుపెట్టానని, గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల పునరుద్ధరణకు చాలా సమయం పట్టనుందన్నారు.
లాక్ డౌన్ ఎత్తివేశాక..
అంతర్జాతీయస్థాయిలో మన ఐటీ కంపెనీలు విశ్వసనీయ భాగస్వాములని కరోనా సంక్షోభంతో నిరూపించడిందన్నారు. లాక్ డౌన్ సమయంలో డెలివరీలో సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నాయని చెప్పారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు తమ కార్యకలాపాల నిర్వహణ తీరును పునఃసమీక్షించుకోగలవన్నారు. తద్వారా ఐటీ సంస్థలకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు లభించగలవన్నారు. నిర్మాణ, తయారీ రంగ కంపెనీల్లో ఐటీది కీలక పాత్ర అన్నారు.
క్లయింట్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి
ఐటీ కంపెనీల క్లయింట్స్ ఆరోగ్యంగా ఉండాలని మహాలింగం అన్నారు. దీనిపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. లేదంటే క్లయింట్స్ ఖర్చులు తగ్గించుకొని, ఇతర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటే ఐటీ కంపెనీలకు కూడా నష్టమేనని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావాలు తీవ్రంగానే ఉండవచ్చునని, వ్యాపారాలు కోలుకోవడానికి సమయం పట్టవచ్చునన్నారు.