కరోనా మహమ్మారి నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, ఐతే కొన్ని రంగాలు పుంజుకోవాలంటే సహకారం అవసరమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. లాక్ డౌన్ పూర్తయి, అన్-లాక్లోకి రావడంతో జూన్ నెల నుండే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభమైందన్నారు. ఈ మేరకు ఆయన ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ మీట్లో మాట్లాడారు.

జూన్ నెల నుండే రికవరీ
రికవరీ ప్రారంభమైందని, అయితే రికవరీ సరళిని చూడాలంటే మూడు నుండి నాలుగు నెలల సమయం వేచి చూడాలని రజనీష్ కుమార్ అన్నారు. కరోనా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, సప్లై చైన్ చెల్లా చెదురు అయిందని చెప్పారు. ఈమహమ్మారి కారణంగా ఏప్రిల్ నెలలో దారుణంగా దెబ్బతిన్నామని, మే నెలలో కాస్త బెట్టర్ అని, జూన్ నెల నుండి రికవరీ ప్రారంభమైందని చెప్పారు. ఊహించిన దాని కంటే వేగంగా రికవరీ ఉందన్నారు.

మారటోరియం పొడిగింపు అవసరం లేదు
కరోనా కారణంగా ఉద్యోగులు, సంస్థలకు తొలుత మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలల పాటు మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీనిపై కూడా రజనీష్ కుమార్ స్పందించారు. మారటోరియంను డిసెంబర్ వరకు పొడిగించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మాట్లాడుతూ ఆగస్ట్ 31వ తేదీ వరకు ఇచ్చిన మారటోరియం చాలునని, ఈ ఏడాది చివరి వరకు అవసరం లేదన్నారు. ఎస్బీఐలో మే చివరి వరకు 20 శాతం మంది మాత్రమే మారటోరియం ఉపయోగించుకున్నారని, మరోసారి పొడిగించడంతో అది మరింతగా పడిపోవచ్చునని చెప్పారు. అలాగే, కొన్ని రంగాలకు ఉపశమనం అవసరమని చెప్పారు.

రుణాలు చెల్లించలేక కాదు..
ఆరు నెలల పాటు మారటోరియం అంటే కంపెనీల రీస్ట్రక్చర్, రిలీఫ్ కోసమని రజనీష్ కుమార్ చెప్పారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడంతో ఇది అవశ్యం కాదని అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయన్నారు. కొన్ని రంగాలపై ఎక్కువ ప్రభావం పడిందని చెప్పారు. ఈ విషయంలో ఆర్బీఐ సరైన విధానం అవసరని తెలిపారు. కరోనా వల్ల ఎన్పీఏలు పెరిగినట్లు ఎస్బీఐ గణాంకాలుచెబుతున్నాయని, వీటిని బ్యాంకు భరించగలదన్నారు. రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ రంగాల్లో మారటోరియంను ఎక్కువగా ఎంచుకున్నారని తెలిపారు. కార్పోరేట్ సంస్థలు నగదు నిల్వలు దాచుకోవడానికి మారటోరియంను ఎంచుకున్నాయని, కానీ రుణ చెల్లింపులు చేయలేక కాదన్నారు.


Click it and Unblock the Notifications