మోడీ 2.0: రికార్డ్కు ఎగిసి అంతలోనే కుప్పకూలి, ఏడాదిలో రూ.27,00,000 కోట్ల సంపద హుష్కాకి
ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తి అయింది. 2014లో 273 సీట్లతో స్వల్ప మెజార్టీ దక్కించుకున్న బీజేపీ 2019లో మాత్రం 303 సీట్లతో సొంతగానే అనూహ్య విజయం సాధించింది. అయినప్పటికీ మిత్రధర్మం ప్రకారం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కాలంలో ఆర్థిక మందగమనం, ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావం భారీగా పడింది. దీంతో మోడీ ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుండి.. ఈ ఏడాది కాలంలో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు.
COVID 19: వచ్చే ఏడాదికి ఇండియా పరుగు, ఎందుకంటే: దువ్వూరి
రూ.27 లక్షల కోట్ల నష్టం
స్టాక్స్ ఇన్వెస్టర్లకు ఈ ఏడాది పెను సవాల్గా మారిందని చెప్పవచ్చు. దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.27,00,000 కోట్ల సంపదను కోల్పోయారు. ఇండియా జీడీపీలో ఇది 13.5 శాతం. కరోనా మహమ్మారి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని (జీడీపీలో 10 శాతం) ప్రకటించింది. దీని కంటే కూడా 35 శాతం అధికంగా ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఈ కాలంలో ప్రతి 10 స్టాక్స్లలో 9 స్టాక్స్ నష్టపోయాయి. BSE లిస్టెడ్ స్టాక్స్లో కేవలం పది శాతం మాత్రమే రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.
ఇన్వెస్టర్ల ఆందోళన
కరోనా మహమ్మారిని నివారించే ఉద్దేశ్యంలో భాగంగా మార్చి 25వ తేదీ నుండి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో వృద్ధి రేటు మార్చి క్వార్టర్లో 3.1 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 4.2 శాతంతో పదకొండేళ్ల కనిష్టానికి పడిపోయింది. గతంలో మందకమనం, ఇప్పుడు కరోనా కారణంగా ఫ్యాక్టరీ ఔట్పుట్స్ క్షీణిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ వంటి రేట్లు తగ్గుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఎందులో పెట్టుబడులు పెట్టాలో తెలియని ఆందోళనలో ఇన్వెస్టర్లు ఉన్నారు.
మందగమనం, లాక్ డౌన్ వల్ల..
గత మూడు నెలలుగా కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిన విషయం అందరికీ తెలిసిందేనని, అంతకుముందు డిసెంబర్ క్వార్టర్ వరకు మందగమనం ఉందని, జీఎస్టీ వంటి అంశాల ప్రభావం కనిపించిందని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ షా అన్నారు. గత వంద సంవత్సరాల మార్కెట్ చరిత్రను చూస్తే, భారత మార్కెట్ కరెక్షన్కు అనుకూల వాతావరణంగా కనిపిస్తోందన్నారు.
రికార్డ్కు చేరుకొని అంతలోనే కుప్పకూలింది
గతంలో మందగమనం కారణంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కార్పోరేట్ ట్యాక్స్ను 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కు 15 శాతానికి పరిమితం చేశారు. ఈ ప్రకటన దేశీయ మార్కెట్పై సానుకూల ప్రభావం చూపింది. దీంతో జనవరిలో రికార్డ్ స్థాయిని అందుకుంది. కానీ అంతలోనే కరోనా రూపంలో మార్కెట్ కుప్పకూలింది. కరోనా దెబ్బతో ఏడాది వృద్ధి నిలిచిపోయినట్లే అంటున్నారు.
ఏడాదిలో ఎన్ని షేర్లు నష్టపోయాయంటే..
BSE లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2019 మే 30వ తేదీన రూ.154.44 లక్షల కోట్లుగా ఉంటే నిన్న శుక్రవారం నాటికి (మే 29, 2020) 17.7 శాతం తగ్గి రూ.127.06 లక్షల కోట్లుగా ఉంది. అంటే ప్రధాని రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మందగమనం, కరోనా కారణంగా రూ.27 లక్షల కోట్లు ఇన్వెస్టర్లు నష్టపోయారు. 2,684 యాక్టివ్ స్టాక్స్లో 2,308 స్టాక్స్ నష్టాల్లోనే ఉన్నాయి. 359 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. 269 స్టాక్స్ (బీఎస్ఈలో 10 శాతం వ్యాల్యూ) మాత్రమే 10 శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి.
ప్రతి అంశానికి ప్రభుత్వాన్ని నిందించలేం
మోడీ 2.0 పాలనకు HDFC సెక్యూరిటీస్కు చెందిన దీపక్ జాసానీ 10 మార్కులకు ఏడు వేశారు. అదే సమయంలో ప్రభుత్వం పనితీరు అంచనాకు మార్కెట్ ఒక్కదానిని తీసుకోలేమని చెప్పారు. మార్కెట్ పనితీరు కేవలం ఆర్థిక విధానాల ప్రభావం మాత్రమే అన్నారు. వీటితో పాటు అంతర్జాతీయ పరిణమాలు, నిబంధనలు, వివిధ అంశాలు ఉంటాయన్నారు. ప్రతి అంశానికి ప్రభుత్వాన్ని నిందించలేమని, అది సరికాదన్నారు. కరోనా తర్వాత మార్కెట్ క్యాప్ చాలా పడిపోయిందంటున్నారు.
ఇన్వెస్ట్ చేయవచ్చు
వ్యాపారాల్లో పారదర్శకత తదితర సంస్కరణల కోసం మోడీ ప్రభుత్వం 2016 నుండి పని చేస్తోందన్నారు. దీని వల్ల ఒకటి రెండేళ్లు ఇబ్బందులు ఉండవచ్చునని, ఇందుకు అనుగుణంగా వ్యాపారాలు మార్పు చెందవచ్చునని చెప్పారు. అప్పుడు బ్యాంకులు, ఆర్థిక విధానాలపై ఒత్తిడి లేకుండా స్థిరమైన వృద్ధి చూడవచ్చునని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చూసి అనూహ్య నిర్ణయాలు తీసుకోవద్దని, దిద్దుబాటు కొనసాగుతోందని, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది మంచి సమయమని, మ్యూచువల్ ఫండ్స్ సిప్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెంచుకోవచ్చునని మరికొందరు చెబుతున్నారు.