మిడ్ సైజ్ ఐటీ కంపెనీల సీఈవోలకు కరోనా ఏడాదిలో బంపర్ బొనాంజా
మిడ్-సైజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కంపెనీల సీఈవోలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్స్ ఆ ఏడాది భారీగా పెరగడంతో మధ్యస్థాయి టెక్ కంపెనీల సీఈవోలకు బంపర్ బొనాంజా వచ్చింది. కరోనా సమయంలో వృద్ధిని నమోదు చేసిన రంగాల్లో ఐటీ రంగం మాత్రమే ముందు ఉంది. వివిధ రంగాలు ఏడాది కాలంగా దారుణంగా దెబ్బతిన్నాయి. ఐటీ రంగం మాత్రం పుంజుకుంది. కరోనా నేపథ్యంలో పలు కంపెనీలు డిజిటల్ వైపు దృష్టి సారించడం కలిసి వచ్చింది.
ఎల్ అండ్ టీ సీఈవో వేతనం ఎంత పెరిగిందంటే
సమాచారం మేరకు ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సీఈవో సంజయ్ జలోనా రెమ్యునరేషన్ గత ఆర్థిక సంవత్సరం 29 శాతం పెరిగింది. ఈ కంపెనీలో భారత ఉద్యోగుల వేతనం మాత్రం 6 శాతం, ఆఫ్షోర్ ఉద్యోగుల వేతన పెంపు 2 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఎల్ అండ్ టీ కంపెనీ 27.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనా సమయంలో కంపెనీ డైరెక్టర్లు తన వేతనాల్లో కోత విధించుకున్న నేపథ్యంలో అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం రెమ్యునరేషన్ ఎక్కువగా ఉందని తెలిపింది.
మైండ్ ట్రీ సీఈవో వేతనం
మైండ్ ట్రీ సీఈవో దేబాషిష్ ఛటర్జీ వార్షిక వేతనం 131 శాతం పెరిగి 11.3 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఉద్యోగులకు సగటున 10 శాతం మాత్రమే పెరిగింది. కరోనా సమయంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పెరగడంతో మధ్య తరహా ఐటీ సంస్థల సీఈవోలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో అధిక పారితోషికం పొందినట్లు చెబుతున్నారు. మైండ్ ట్రీ గత ఆర్థిక సంవత్సరం 76 శాతం ప్రాఫిట్ నమోదు చేయగా, డీల్స్ పెరుగుదల 12.3 శాతంగా ఉంది.
ఈ సీఈవో శాలరీ 153 శాతం జంప్
పర్సిస్టెంట్ సిస్టమ్స్ అమెరికాకు చెందిన సందీప్ కల్రాన్ను అక్టోబర్ 2020లో హైర్ చేసుకుంది. ఇతని కంపెన్షేషన్ 153.28 శాతం పెరిగి రూ.11.1 కోట్లకు చేరుకుంది. ఇందులో స్టాక్ వ్యాల్యూ ఆప్షన్స్ 110 శాతంగా ఉంది. మధ్యశ్రేణి ఐటీ కంపెనీల ఉద్యోగుల వేతనం మాత్రం సగటున 10 శాతం లోపు ఉండగా సీఈఓల వేతనాల్లో భారీ పెరుగుదల నమోదైంది.