హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్? అదే దారిలో అమెజాన్, గూగుల్
ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అతిపెద్ద డేటా సెంటర్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రూ.15,000 కోట్లతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటుచేసే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉందని తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.
త్వరలో దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ డేటా సెంటర్ కోసం ఇప్పటికే హైదరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ కలిసి ఓ స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మైక్రోసాఫ్ట్ స్పందించాల్సి ఉంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతోన్న విషయం తెలిసిందే. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ కూడా భారత్లో డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కనిపిస్తున్నాయి. 2024 నాటికి భారత్లో డేటా సెంటర్స్ ఆదాయం నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఇదిలా ఉండగా భారత్లో డేటా సెంటర్స్ నిర్మాణం కోసం కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకునే దిశగా వెళ్తోంది. బీఏఎం డిజిటల్ రియాల్టీ పేరిట డేటా సెంటర్స్ను నిర్మించాలని యోచిస్తున్నారు. అలాగే భారత్లో క్లౌడ్ డేటా సెంటర్స్ ఏర్పాటు విషయమై 2019లో రిలయన్స్ జియోృ-మైక్రోసాఫ్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా జియో నెట్వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ తమ క్లౌడ్ టెక్నాలజీ అజూర్ క్లౌడ్ను అందుబాటులోకి తీసుకురానుంది.