పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్: మైక్రోసాఫ్ట్ బంపరాఫర్, కండిషన్ అప్లై!
కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులకు ఇంటి వద్ద నుండి పని చేసే అవకాశాన్ని కల్పించాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు 90 శాతం నుండి 95 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పించింది. ఈ అంశానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వెసులుబాటును శాశ్వతంగా కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది.
నల్లధనంపై పోరులో 'రెండో' అడుగు! భారత్ చేతికి స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలు
పర్మినెంట్గా ఇంటి నుండి పని.. కండిషన్!
పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఉపయోగించుకోవాలా వద్దా అనే విషయాన్ని ఉద్యోగుల ఇష్టానికి వదిలేసింది మైక్రోసాఫ్ట్. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ తగ్గుముఖం పట్టలేదు. అప్పుడప్పుడు తగ్గినట్లు కనిపించినా మళ్లీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుందట. ఉద్యోగులకు ఇష్టమైతే శాశ్వతంగా ఇంటి నుండి పని చేయవచ్చునని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు మొదట మేనేజర్ల నుండి అనుమతి పొందాలి.
వీరికి మాత్రం నో...
అయితే ల్యాబ్స్లో పని చేసే వాళ్లు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే వాళ్లకు ఇంటి వద్ద నుండి పని చేసే సదుపాయం లేదు. హర్డ్వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్స్, శిక్షణా కార్యక్రమాలలో పనిచేస్తోన్న ఉద్యోగులు మినహా ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచి పని చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, ఉద్యోగులు వారి నివాస స్థలాలను మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. అమెరికాలో పనిచేస్తోన్న విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లి పని చేయవచ్చు. అమెరికాలోని ఉద్యోగులు కూడా తమ సొంత ప్రాంతాలకు వెళ్లవచ్చు.
వేతనాల్లో మార్పులు
వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ నేపథ్యంలో వేతనాల్లో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయని, ఇందుకు మేనేజర్ నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. పూర్తి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి వీలైనంతగా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని అందిస్తామని తెలిపింది. జూన్ క్వార్టర్ నాటికి మైక్రోసాఫ్ట్లో 1,63,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 96,000 మంది అమెరికాలో ఉన్నారు.