ఒమిక్రాన్ ఎఫెక్ట్: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం: అదేబాటలో గూగుల్, ఇంటెల్
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్కు చెందిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. వందకు పైగా దేశాల్లోకి ఎంట్రీ ఇచ్చిందీ మహమ్మారి. కరోనా వైరస్ తరహా పరిస్థితులను మళ్లీ తీసుకుని రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం బ్రిటన్లో అధికంగా ఉంటోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ దీనికి తోడు కావడంతో రోజువారీ కొత్త కేసులు అనూహ్యంగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు లక్షను దాటేస్తున్నాయి.
రూ.177 కోట్లు దాచి పెట్టడమంటే మాటలా: లెక్క పెట్టడానికే రెండురోజులు పట్టిందిగా
దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలోనూ ఒమిక్రాన్ కొత్త కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. యూరప్ దేశాల తరహాలో కాకపోయినా.. ఓ మోస్తరుగా ఒమిక్రాన్ వేరియంట్ అమెరికాపై ప్రభావాన్ని చూపుతోంది. దీన్ని నివారించడానికి కఠిన ఆంక్షలను విధంచే అవకాశాలను జో బైడెన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికన్ దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది.
ఇదే అమెరికాలోని లాస్ వెగాస్లో 2022 జనవరిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఈ షోలో పాల్గొనకూడదని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. దీన్ని అధికారికంగా ప్రకటించింది. లాస్ వెగాస్లో జనవరి 5,6,7,8 తేదీల్లో ఏర్పాటు కానున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోకు తాము దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది. దీన్ని రద్దు చేయాలని కూడా రెకమెండ్ చేసింది మైక్రోసాఫ్ట్.
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున- ఈ భారీ ప్రదర్శనను నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలించట్లేదని తెలిపింది. జనవరి 5వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ షో కోసం ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తన స్లాట్ను బుక్ చేసుకుంది. లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా (ఫేస్బుక్), ట్విట్టర్, అమెజాన్, టిక్టాక్, పింటరెస్ట్, ఆల్ఫాబెట్కు చెందిన వేమో వంటి బిగ్ షాట్స్ ఈ ఎలక్ట్రానిక్స్ సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.
టాప్ సెర్చింజిన్ గూగుల్, ప్రాసెసర్ మాన్యుఫాక్చరర్ కంపెనీ ఇంటెల్.. ఇప్పటికే తమ నిర్ణయాన్ని తెలిపాయి. తాము ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో పాల్గొనట్లేదని స్పష్టం చేశాయి. ఇదే జాబితాలో తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు పాల్గొనే ప్రతిష్ఠాత్మక షో కావడం వల్ల శాంసంగ్ వంటివి ఇంకా తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ షోనకు దూరంగా ఉండాలా? వద్దా. అనేది తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని శాంసంగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి హాన్ జోంగ్-హీ తెలిపారు.