ఆ ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్పై లంచాల ఆరోపణలు, వేలకోట్లు
విదేశాల్లో ఒప్పందాల ఖరారుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున లంచాల్ని ఇస్తోందని మాజీఉద్యోగి ఒకరు ఆరోపించారు. ముడుపులు, లంచాల కోసం ప్రతి సంవత్సరం 200 మిలియన్ డాలర్లు లేదా రూ.1.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజావేగుల వేదికగా మారిన లయనెస్ వెబ్ సైట్లో ఓ వ్యాసం రాశారు. ఘనా, నైజీరియా, జింబాబ్వే, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఒప్పందాలకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు సదరు మాజీ ఉద్యోగి. అతని పేరు ఎలాబ్.
1998లో సంస్థలో చేరారు ఎలాబ్. తాను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో సంస్థ ఉత్పత్తులను ప్రమోట్ చేయడంపై పని చేశానని తెలిపారు. ఈ క్రమంలో తన పనితీరును మెచ్చి కంపెనీలో పలు పదోన్నతులు పొందినట్లు చెప్పారు. కొంతకాలం తర్వాత సంస్థలో తనకు విచిత్ర పరిస్థితులు కనిపించాయని, తన కంటే కింది హోదాలోని చాలా మంది ఉద్యోగులు విలాసవంతమైన కార్లు, విల్లాలు కొనుగోలు చేసి జీవితం గడుపుతున్నట్లు గుర్తించానన్నారు.
తనకు మాత్రం ఎన్ని ప్రమోషన్లు వచ్చినా ఇల్లు కొనుగోలు చేయడానికే ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ఓ సంఘటనకు సంబంధించి తాను కంపెనీకి ఫిర్యాదు చేశానని, అయితే ఆ తర్వాత తనపై ప్రతీకార చర్యలు ప్రారంభించారన్నారు. అప్పటి వరకు మంచి పర్ఫార్మర్గా ఉన్న తనను పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లో చేర్చారన్నారు.
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డుకు కూడా ఈ విషయం తెలిపానన్నారు. అక్కడి నుండి పెద్దగా స్పందన రాలేదని, తనతో పాటు మరో మరికొందరు కంపెనీలో జరిగిన అవినీతి గురించి గళం విప్పారన్నారు. వారిని సంస్థ నుండి బయటకు పంపించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. కంపెనీలో ఎలాంటి అనైతిక చర్యలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు.