Microsoft: వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్: కేసీఆర్ సర్కార్తో ఫైనల్
హైదరాబాద్: అంతర్జాతీయ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్.. తెలంగాణలో తన పరిధిని విస్తరించుకోనుంది. ఓ స్పెషలైజ్డ్ డేటా సెంటర్ను నెలకొల్పడానికి సన్నద్ధమౌతోంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వంతో తుది విడత చర్చలను నిర్వహిస్తోంది. ఈ చర్చలు కొలిక్కి వచ్చిన వెంటనే- డేటా సెంటర్ ఏర్పాటును మైక్రోసాఫ్ట్ కంపెనీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడుల విలువ కనీసం 15,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ గనక సాకారమైతే.. వందల సంఖ్యలో అదనపు ఉద్యోగాలను కల్పించడానికి వీలవుతుంది.
హైదరాబాద్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు ఉన్నాయి. వందలాది మంది సాఫ్ట్వేర్ నిపుణులు అందులో పనిచేస్తోన్నారు. దీనికి అదనంగా ఓ డేటా సెంటర్ను నెలకొల్పడానికి మైక్రోసాఫ్ట్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్లో పెట్టబడులకు అనువైన వాతావరణం ఉండటం వల్ల అక్కడే దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ డేటా సెంటర్ను నెలకొల్పడానికి ఇప్పటికే తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వ శాఖతో చర్చలు నిర్వహించింది. ఇక తుది విడత చర్చలను నిర్వహించాల్సి ఉంది. ఈ భేటీ తరువాత ఇక మైక్రోసాఫ్ట్ యాజమాన్యం తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.
బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిసి భారత్లో జాయింట్ వెంచర్ను నెలకొల్పింది మైక్రోసాఫ్ట్. బీఏఎం డిజిటల్ రియాలిటీ పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేయనుంది. కెనడాకు చెందిన కంపెనీ బ్రూక్ఫీల్డ్. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టెడ్ కూడా. బీఏఎం డిజిటల్ రియాలిటీ కూడా లిస్టెడ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన డేటా సెంటర్లను నిర్మించడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలను ఇది కల్పిస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో నిర్వహిస్తోన్న చర్చలు విజయవంతమైతే.- డేటా సెంటర్కు సంబంధించిన నిర్మాణ పనులు, ఇతర కార్యకలాపాలను బీఏఎం డిజిటల్ రియాలిటీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు బిజినెస్ పోర్టల్స్ అంచనా వేశాయి.