ఇండియాకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల!
ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ నెలలోనే భారత్ లో పర్యటించబోతున్నారు. మన హైదరాబాద్ కు చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ ఐన తర్వాత కంపెనీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతున్నారు. ఈ నెలలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా భారత్ లో పర్యటించబోతున్న విషయం తెలిసింది. దాదాపు అదే సమయంలో సత్య నాదెళ్ల కూడా ఇండియాకి విచ్చేయనున్నారని సమాచారం. ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య అయన ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో పలు సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తన పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇండస్ట్రీ పెద్దలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో సమావేశం కాబోతున్నారు. 'అవును. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ నెలాఖరులో భారత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అయన కస్టమర్లు, యంగ్ అఛీవర్స్, స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్, ఎంట్రప్రెన్యూర్స్ ను ఉద్దేశించి మాట్లాడతారు' అని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనం ప్రచురించింది.
పర్యటనకు ప్రాధాన్యం...
ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద బిల్లు సిఏఏ పై చేసిన వ్యాఖ్యలతో అయన ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. దీనిపై అయన వివరణ ఇచ్చినప్పటికీ అయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారో, వ్యతిరేక వ్యాఖ్యలు చేశారో ఎవరికీ అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో అయన భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అదే సమయంలో సత్య నాదెళ్ల .. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఐన తరువాత తొలిసారిగా భారత్ లో పర్యటిస్తున్నతేదీల్లోనే ఇండియా రాక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ఒక దేశ అధ్యక్షుడు, లేదా ప్రధాన మంత్రి విదీశీ పర్యటనల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పర్యటించటం రివాజు. రెండు దేశాల మంధ్య ఆర్థిక, వాణిజ్య ఒప్పందాల్లో వారిది కీలక స్థానం ఉంటుంది. ఒకవేళ ప్రస్తుత సత్య నాదెళ్ల పర్యటన కూడా అలాంటిదేనా అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
స్థానికంగా డేటా ...
కొన్నేళ్లుగా అమెరికా మనపై ఒత్తిడి తెస్తున్నా... వెనక్కి తగ్గకుండా మన దేశ పౌరుల డేటా సమాచారం నిల్వ, దాని భద్రతా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం డేటా లోకలైజషన్ బిల్లును ముందుకు తీసుకొచ్చింది. ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. అలాగే సోషల్ మీడియా తో పాటు ఈ కామర్స్ రంగంలో వినియోగించే డేటా ను కూడా స్థానికంగా స్టోర్ చేయాల్సిందేనని ఇండియా పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు ఇండియాలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది ఆయా కంపెనీలకు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే, ఈ విషయంలో భారత్ పై మరింత ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ పర్యటనలో కొన్ని ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ కు వస్తారా?
సత్య నాదెళ్ల హైదరాబాద్ కు చెందిన తెలుగువారు. అయన మైక్రోసాఫ్ట్ సీఈఓ ఐన తర్వాత రెండు మూడు పర్యాయాలు హైదరాబాద్ కు వచ్చారు. కానీ, ఒకసారి మాత్రమే ఇక్కడి ఇండియా డెవలప్మెంట్ సెంటర్ లో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకసారి అయన తల్లి, మరోసారి అయన తండ్రి అంత్యక్రియాలకు హాజరయ్యారు. అంతకు మించి హైదరాబాద్ కు రాలేదు. ఈ సారి కూడా అయన పర్యటనలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అందులో హైదరాబాద్ లేదు. కానీ, మైక్రోసాఫ్ట్ కు అమెరికా వెలుపల అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్ ఉన్నది కేవలం హైదరాబాద్ లోనే. అయినా అయన ఇక్కడ పర్యటిస్తారా లేదా అన్నది ఇంకా వెల్లడి కాలేదు.