మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు షాక్, భారత్కు అప్పగించాల్సిందే
పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) స్కాం నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా ప్రభుత్వం అరెస్ట్చేసి జైలులో పెట్టింది. చోక్సీని భారత్కు అప్పగించాల్సిందేనని డొమినికా ప్రభుత్వం పేర్కొంది. అక్కడి హైకోర్టులో చోక్సీ హైబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు వచ్చింది. దీనిపై న్యాయస్థానం ముందు డొమినికా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదనలు వినిపించింది. చోక్సీ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని, దానిని విచారించవద్దని కోరింది.
పౌరసత్వం లేదు... ఉంది
మెహుల్ చోక్సీ అంటిగ్వా నుండి పారిపోయి డొమినికాలో పోలీసులకు చిక్కాడు. చోక్సీ తరపున ఆయన న్యాయవాదులు హైబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చోక్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. చోక్సీ తరపున ఏడుగురు న్యాయవాదులు హాజరయ్యారు.
చోక్సీ భారత పౌరుడు కాదని, అతనిని అక్కడికి తరలించవద్దని చోక్సీ తరఫున లాయర్లు అన్నారు. భారత దర్యాఫ్తు సంస్థలు కూడా కోర్టుకు హాజరయ్యాయి. చోక్సీ ఎప్పుడు కూడా భారత పౌరసత్వాన్ని వదులుకోలేదని చెబుతూ అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డును సమర్పించాయి.
బెయిల్ నిరాకరణ
మెహుల్ చోక్సీ వేసిన బెయిల్ పిటిషన్ను డొమినికా కోర్టు నిరాకరించింది. అక్రమంగా దేశంలోకి జొరబడిన కేసుకు సంబంధించి బెయిల్ నిరాకరించింది. చోక్సీ వీల్ చైర్లలో, బ్లూ టీ-షర్ట్, బ్లాక్ షార్ట్లో కోర్టుకు హాజరయ్యాడు. తాను దేశంలోకి జొరబడలేదని, తనను కిడ్నాప్ చేసి తీసుకు వచ్చారని చోక్సీ కోర్టుకు చెప్పాడు.
స్పందించిన భార్య
మరోవైపు, మెహుల్ చోక్సీ భార్య ప్రీతిచోక్సీ భర్త అరెస్టుపై స్పందించారు. తన భర్తకు గాయాలు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ సజీవంగా వెనుకకు తీసుకురావాలని భావిస్తే తన భర్తను భౌతికంగా, మానసికంగా ఎందుకు వేధించారన్నారు. తన భర్తకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అంటిగ్వా పౌరుడిగా ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయన్నారు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం రక్షణ కల్పించాలన్నారు. కరేబియన్ దేశాల చట్టాలపై విశ్వాసం ఉందన్నారు.