Samsung: పిచాయ్-సత్య నాదెళ్ల తర్వాత అగ్రస్థానానికి చేరువలో మరో ఇండియన్
ఢిల్లీ: గుజరాత్కు చెందిన ప్రణవ్ మిస్త్రీ కంప్యూటర్ సైంటిస్ట్, ఆవిష్కర్త. సిక్స్త్ సెన్స్ ద్వారా ఈయన పాపులర్ అయ్యారు. ఆయన మైక్రోసాఫ్ట్, గూగుల్, సీఎంయూ, నాసా, యునెస్కో, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి దిగ్గజ టెక్ కంపెనీల్లో పని చేశారు. శాంసంగ్ గెలాక్సీ గేర్ అండ్ ప్రాజెక్టులోను పని చేశారు. తాజాగా ఆయన స్టార్ ల్యాబ్స్ (శాంసంగ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్-STAR ల్యాబ్స్) ప్రెసిడెంట్, సీఊవోగా నియమితులయ్యారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండిపెండెంట్ ఎంటిటీ STAR ల్యాబ్స్. అక్టోబర్ 26వ తేదీన లింక్డిన్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
అగ్రస్థానానికి చేరువలో మరో ఇండియన్
38 ఏళ్ల ప్రణవ్ మిస్త్రీ 2012 నుంచి శాంసంగ్తో కలిసి పని చేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఆయన పని చేశారు. మే 2017 నుంచి ఆయన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వివిధ వరల్డ్ టెక్ దిగ్గజ కంపెనీల్లో భారతీయులు కీలక స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు స్టార్ ల్యాబ్స్ సీఈవోగా నియమితులు కావడం ద్వారా మరో భారతీయుడు మరో టెక్ కంపెనీ అగ్రస్థానానికి దగ్గరలో ఉన్నారు.
డిజైనీర్ డిజైనర్
సీనియర్ ఆవిష్కర్తలు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ప్రణవ్ మిస్త్రీ ఒకరు. ఇతను ఐఐటీ ముంబై నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థిగానే మౌస్ లెస్ పేరుతో కనిపించకుండా పని చేసే మౌస్ని తయారు చేశారు. మరిన్ని పరికరాలు తయారు చేశారు. అక్కడి నుంచి మొదలైన ఆవిష్కరణల పర్వం కొనసాగింది. ఐఐటీ నుంచి ఎంఐటీకి వెళ్లి మీడియా ఆర్డ్స్ అండ్ సైన్స్లో మరో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. పదేళ్లలో గూగుల్, మైక్రోసాఫ్ట్, నాసా, యునెస్కో లాంటి వివిధ సంస్థలకు పని చేశారు. థింక్ టీమ్ హెడ్గా పని చేశారు. శాంసంగ్ గెలాక్సీ గేర్ సృష్టికర్త. సిక్స్త్ సెన్స్, మౌస్ లెస్, స్పర్ష్, టెలి టచ్, ప్రికర్సర్, బ్లింక్ బాట్, థర్డ్ ఐ, క్వికీస్.. ఇలా ఎన్నింటినో కనిపెట్టారు. తనను తాను డిజైనీర్ డిజైనర్గా చెప్పుకుంటారు.
హర్మాన్ సీఈవోగా దినేష్ పాలీవాల్
శాంసంగ్ విభాగాల్లోని కీలక స్థానాల్లో ఉన్నవారిలో ప్రణవ్ మిస్త్రీతో పాటు అగ్రాకు చెందిన దినేష్ పాలివాల్ (61) ఉన్నారు. ఆడియో టెక్నాలజీ కంపెనీ హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్, సీఈవోగా దినేష్ పాలీవాల్ ఉన్నారు. జేబీఎల్, హర్మాన్ కార్డాన్, ఇన్ఫినిటీ, ఏకేజీ వంటి పలు సబ్ బ్రాండ్స్ ఉన్నాయి. హర్మాన్ను శాంసంగ్ 2016 నవంబర్లో 8 బిలియన్ డాలర్లకు అక్వైర్ చేసుకుంది. పాలీవాల్ నేతృత్వంలో హర్మాన్-శాంసంగ్ ఆటో కంపెనీల కోసం కనెక్టెడ్ కారు ప్లాట్ఫాంను నిర్మించారు.
నోకియా సీఈవోగా రాజీవ్ సూరి
మరో టెక్ కంపెనీ నోకియాలో ఢిల్లీలో జన్మించిన రాజీవ్ సూరి (52) కీలక బాధ్యతలు చేపట్టారు. సీఈవో నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్ వర్క్స్ నుంచి 2014లో నోకియా సీఈవోగా నియమితులయ్యారు. సూరి నాయకత్వంలో నోకియా తన సాఫ్టువేర్ వ్యాపారాన్ని పెంచుకుంది. హెచ్ఎండీ గ్లోబల్తో టైయ్యప్ అయింది. నోకియా వ్యాల్యూ 1 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్లకు పెరిగింది.
గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్
తమిళనాడులో జన్మించిన సుందర్ పిచాయ్ (47) ప్రస్తుతం గూగుల్ సీఈవోగా ఉన్నారు. ఆయన 2004లో గూగుల్లో జాయిన్ అయ్యారు. క్రోమ్, క్రోమ్ ఓఎస్, మ్యాప్స్, జీమెయిల్, ఆండ్రాయిడ్ వంటి వాటిల్లో పని చేస్తూ 2015 ఆగస్ట్లో సీఈవో స్థాయికి ఎదిగారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్, గూగుల్ పే, డేడ్రీమ్ వర్చువల్ రియాలిటీ హ్యాండ్ సెట్ వంటి వాటిని తీసుకు వచ్చింది.
సత్య నాదేళ్ల నాయకత్వంలో దూసుకెళ్తున్న మైక్రోసాఫ్ట్
సాఫ్టువేర్, పీసీ విభాగంలో గూగుల్ ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ సీఈవోగా హైదరాబాదులో జన్మించిన సత్య నాదెళ్ల ఉన్నారు. 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు. 2014 ఫిబ్రవరిలో స్టీవ్ బాల్మర్ నుంచి సీఈవో బాధ్యతలను చేపట్టారు. సత్య నాదెళ్ల (52) నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ సాఫ్టువేర్ పైన ఎక్కువ దృష్టి సారించింది. ఈ కంపెనీ లింక్డిన్, గితుబ్లను అక్వైర్ చేసుకుంది. మైక్రోసాఫ్ట్ ధరలు ఈ కాలంలో మూడు రెట్లు పెరిగాయి. ఆపిల్, అమెజాన్ తర్వాత 1 ట్రిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్ కలిగిన మూడో సంస్థగా అవతరించింది.
ది గ్రేట్ శంతను నారాయణ్
మరో ఇండియన్, శంతను నారాయణ్.. అడోబ్ సీఈవోగా ఉన్నారు. ఇది ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో వంటి ఎడిటింగ్, డిజైన్ సాధనాలకు పేరుగాంచిన సంస్థ. శంతను నారాయణ్ (56) కూడా హైదరాబాదులో జన్మించినవారే. ఫార్చ్యూన్ మేగజైన్ టాప్ 20 బిజినెస్ ఎగ్జిక్యూటివ్ 2018లో నారాయణ్ ఉన్నారు. అడోబ్లో ఎన్నో మార్పులు చేసినందుకు ఆయనకు ఈ ఘనత దక్కింది. అతను సీవోవో, ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించి సీఈవో స్థాయికి ఎదిగారు. 2007లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చేరారు.