Meesho IPO: పబ్లిక్ ఇష్యూకు రానున్న మరో ఇ-కామర్స్ ప్లాట్ఫామ్
బెంగళూరు: బెంగళూరు ప్రధానకేంద్రంగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఇ-కామర్స్ యూనికార్న్ కంపెనీ మీషో.. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేయనుంది. దీనికి అవసరమైన కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే రెండు సంవత్సరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
2015లో ఏర్పాటైన స్టార్టప్ ఇది. ఆ తరువాత యూనికార్న్ కంపెనీగా ఎదిగింది. విదిత్ ఆత్రేయ, సంజీవ్ బర్న్వల్ సంయుక్తంగా దీన్ని నెలకొల్పారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఇ-కామర్స్ సెగ్మెంట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నామని, సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నామని విదిత్ ఆత్రేయ చెప్పారు.
ప్రస్తుతం 10 కోట్లమందికి పైగా వినియోగదారులు తమ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోళ్లను నిర్వహిస్తోన్నారని, సమీప భవిష్యత్తులో దీన్ని రెట్టింపు చేస్తామని అన్నారు. ఇదే క్రమంలో పబ్లిక్ ఇష్యూను కూడా జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోన్నామని వివరించారు. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా ఎంత మొత్తాన్ని ఇన్వెస్టర్ల నుంచి సేకరించాలనేది ఇంకా నిర్ధారించలేదని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ ఉంటుందని అన్నారు.
బంగారం ధరలో భారీ పెరుగుదల: కారణలివే..
ప్రస్తుతం నైకా, గో కలర్స్, క్యాంపస్ వంటి కొన్ని ఇ-కామర్స్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి.. అదరగొట్టాయి. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచిపెట్టాయి. ఫల్గుణి నాయర్ నెలకొల్పిన నైకా షేర్లు.. ఒక దశలో 100 శాతానికి పైగా రిటర్న్ ఇచ్చాయి. ఆ తరువాత షేర్ల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. నష్టాలు మాత్రం రాలేదు. అదే రేంజ్లో గో కలర్స్ కూడా తన ప్రత్యేకతను నిలుపుకొంది.
దీనితో మీషో ఐపీఓ కూడా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందనే అంచనాలు లేకపోలేదు. ఆయా షేర్లన్నీ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్ సత్తా చాటాయి. స్టాక్ మార్కెట్లో వాటిని సక్సెస్ చేశాయి. ఇకముందు ఇలాంటి ఇ-కామర్స్ కంపెనీలు నిరభ్యంతరంగా పబ్లిక్ ఇష్యూకు రావొచ్చనే సంకేతాలను పంపించాయి. దీనితో మీషో కూడా ఐపీఓను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.