McDonald: ఏదీ సేఫ్ కాదు: డేటా మొత్తం బ్రీచ్: బిల్లింగ్ సిస్టమ్?
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఫాస్ట్ఫుడ్ అండ్ బర్గర్ చైన్ రెస్టారెంట్ జెయింట్ మెక్డొనాల్డ్.. తాజాగా డేటా లీకేజ్ బాధిత కంపెనీగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కంపెనీకి చెందిన డేటా వ్యవస్థను ఛేదించారు. దాన్ని బహిర్గతం చేశారు. ఈ విషయాన్ని మెక్డొనాల్డ్ కార్పొరేషన్ యాజమాన్యం ధృవీకరించింది. దక్షిణ కొరియా, తైవాన్లల్లో డేటా బ్రీచ్ చోటు చేసుకున్నట్లు తెలిపింది. ఈ రెండు దేశాల్లోని తమ నెట్వర్క్లో అవాంఛిత పరిణామాలు సంభవించాయని, అనధికారిక కార్యకలాపాలు నమోదైనట్లు స్పష్టం చేసింది.
దక్షిణ కొరియా, తైవాన్లల్లో డేటా బ్రీచ్ చోటు చేసుకుందనే విషయాన్ని తమకు ఉన్న అత్యాధునిక నెట్వర్క్ ద్వారా వెంటనే గుర్తించగలిగామని, దాన్ని సరిచేశామని వెల్లడించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. చిన్నతరహా ఫైల్స్ల్లో కంపెనీకి సంబంధం లేని వ్యక్తులు యాక్సెస్ అయినట్లు గుర్తించామని పేర్కొంది. ఇందులో కొంతమంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కూడా ఉన్నట్లు తేల్చి చెప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు యాక్సెస్ అయిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆ ఫైల్స్ను క్లోజ్ చేశామని మెక్డొవెల్ యాజమాన్యం వివరించింది.
అన్ ఎథికల్ హ్యాకర్స్ ఈ డేటా బ్రీచింగ్కు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లకు సంబంధించిన పేమెంట్ల వివరాలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, వాటి నంబర్లు, పిన్ నంబర్లు.. ఇలాంటి బిల్లింగ్, పేమెంట్లకు చెందిన సమాచారం చోరీకి గురి కాలేదని మెక్డొనాల్డ్ యాజమాన్యం వెల్లడించింది. కాగా- ఈ మధ్యకాలంలో తరచూ టాప్ బిజినెస్ కంపెనీలను టార్గెట్గా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతోన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం ప్రాసెసింగ్ కంపెనీ, బ్రెజిల్కు చెందిన జేబీఎస్ ఎస్ఏ డేటాను హ్యాకర్లు బ్రీచ్ చేసిన విషయం తెలిసిందే. తమ డేటాను సొంతం చేసుకోవడానికి హ్యాకర్లకు ఏకంగా 11 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి వచ్చిందని ఆ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. అమెరికా ఈస్ట్కోస్ట్లో సగం ప్రాంతాలకు చమురును సరఫరా చేసే కంపెనీ యాజమాన్యం కొలోనియల్ పైప్లైన్ డేటా సిస్టమ్ కూడా హ్యాకర్ల పాలిట పడింది. ఫలితంగా 75 బిట్ కాయిన్లు అంటే.. 4.4 మిలియన్ డాలర్ల మేర మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందా కంపెనీకి.