మారుతీ సుజుకీపై చిప్స్ కొరత ప్రభావం, 40 శాతానికి పరిమితం
చిప్స్ కొరత కార్ల పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. గత కొంతకాలంగా వాహన పరిశ్రమను చిప్ సెట్స్ కొరత వేధిస్తోంది. అయితే ఈ కొరత తాత్కాలికమేనని, 2022 కల్లా ఇది పరిష్కారం కావొచ్చునని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవల తెలిపారు. ఉత్పత్తి పాక్షికంగా తగ్గిందని, దీని ప్రభావం ఎక్కువగా ఏమీలేదన్నారు. అయితే ఈ చిప్స్ కొరత ప్రభావం మారుతీ పైన పడింది.
సాధారణ ఉత్పత్తిలో సగానికి పైగా ఈ సెప్టెంబర్ నెలలో పడిపోవచ్చునని మంగళవారం కంపెనీ తెలిపింది. హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోని ప్లాంట్స్లో సెమీకండక్టర్ కొరత కారణంగా మొత్తం ఉత్పత్తి కేవలం 40 శాతానికి పరిమితం కావొచ్చునని చెప్పింది. గుర్గావ్, మనేసర్ తదితర ప్లాంట్స్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 22.5 లక్షల యూనిట్లుగా ఉంది. కాగా, వాహన ధరలు పెంచకపోతే నష్టాలు తప్పవని, పెరుగుతున్న ఉత్పాదక వ్యయానికి అనుగుణంగా కార్ల ధరలు పెంచితే సంస్థకు లాభాలు అని పేర్కొంది.
అత్యాధునిక ఫీచర్స్తో వస్తోన్న కార్లలో నియంత్రణ, మెమరీ ఫంక్షన్స్ కోసం సిలికాన్ చిప్ప్ ఉపయోగిస్తారు. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సెల్ఫోన్లలోను వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. కరోనా తర్వాత ఈ చిప్స్కు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు, డిమాండ్కు తగినట్లు తమ ఉత్పత్తి సామర్ద్యం ఉపయోగించలేకపోతున్నాయి.