Maruti Suzuki: కార్ల ధరలు భారీగా పెరగనున్నాయ్: సెప్టెంబర్ నుంచే
ముంబై: దేశంలో వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వాహన ధరలకు రెక్కలు రానున్నాయి. ఒక తయారీ కంపెనీ తన కార్లు.. ఇతర వాహనాల ధరలను పెంచితే.. మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటోమొబైల్ సెక్టార్లో ఎప్పుడూ ఉండేదే. అదే ఆనవాయితీ ఇప్పుడు మళ్లీ కనిపించనుంది. సెప్టెంబర్ నెలలోనే దీనికి ముహూర్తం పడనుంది. దేశంలో అత్యధికంగా విక్రయమయ్య కార్ల తయారీ కంపెనీగా పేరున్న మారుతి సుజుకితో ఈ పెరుగుదల ప్రారంభం కానుంది.
మారుతి సుజుకి వాహన రేట్లు..
మారుతి సుజుకి వాహనాల ధరలు పెరగనున్నాయ్. సెప్టెంబర్ నుంచి వాహనాల రేట్లను పెంచనున్నట్లు మారుతి సుజుకి యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని మోడల్స్ కార్ల రేట్లను పెంచాలని ప్రతిపాదించినట్లు మారుతి సుజుకి యాజమాన్యం తెలిపింది. కార్ల తయారీలో వినియోగించే పరికరాల, విడి భాగాల ధరలు భారీగా పెరగడం వల్ల ఈ ప్రతిపాదనలను రూపొందించాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇన్పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, దాని ప్రభావం వాహనాల తయారీపై పడుతోందని స్పష్టం చేసింది.
ఇన్పుట్ భారాన్ని కొంతమేరకైనా..
ఈ భారాన్ని కొంతమేరకైనా పంచుకోవాలనే ఉద్దేశంతోనే వాహన ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. కార్లు, ఇతర వాహనాల తయారీ, సెకెండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడ.. వాటిని విక్రయించడం, ఆటోమొబైల్ స్పేర్ పార్టులు, ఇతర కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ సెక్టార్లో దేశంలోనే టాప్ బ్రాండింగ్ ఉన్న కంపెనీగా ఆవిర్భవించింది. దేశంంలోనే అత్యధిక సంఖ్యలో కార్లు, ఇతర వాహనాల విక్రయించే సంస్థగా పేరుంది మారుతి సుజుకికి.
భారీగా నెట్ ప్రాఫిట్..
నిజానికి- విడిభాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల మారుతి సుజుకికి పెద్దగా నష్టం కూడా వచ్చిన సందర్భం లేదు. జూన్ 30వ తేదీ నాటికి ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశించిన మేర నెట్ ప్రాఫిట్ను అందుకుందా కంపెనీ. 475 కోట్ల రూపాయల మేర నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చితే- నెట్ ప్రాఫిట్ అసాధారణంగా పెరిగినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి త్రైమాసిక కాలానికి 268.30 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మారుతి సుజుకి చవి చూసింది.
16 వేల కోట్లకు పైగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోండటాన్ని నివారించడానికి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్-మే-జూన్ నెలల కాలానికి 268 కోట్ల రూపాయల నెట్ లాస్ను రికార్డు చేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన సంక్షోభ సమయంలోనూ 475 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ను అందుకోగలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 16,799.90 కోట్ల రూపాయల విలువ చేసే వాహనాలను విక్రయించింది.
విడిభాగాల ధరలతో..
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నమోదైన ఈ సంఖ్య 3,679 కోట్ల రూపాయలే. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల వాహనాల విక్రయ లావాదేవీలను పోల్చుకుంటే 356.6 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది మారుతి సుజుకి. అయినప్పటికీ- విడి భాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్పుట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే ఉద్దేశంతో- కార్లు, ఇతర వాహనాల రేట్లను పెంచబోతున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది.