ఆరు నెలల్లో వాట్సాప్ పే... ఇండియాలో ఎప్పుడో !
వాట్సాప్.. మన నిత్యజీవితంలో విడదీయలేని భాగం అయిపోయింది. అది లేకపోతే చేతులు కాళ్ళు ఆడని పరిస్థితి. అద్భుతమైన ఫీచర్లు, అత్యంత సులభంగా ఉపయోగించే వీలు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. అయితే, అతి త్వరలో మరో కొత్త ఫీచర్ ను జోడించబోతోంది. మరికొద్దీ రోజుల్లోనే వాట్సాప్ పే పేరుతో నగదు బదిలీ సదుపాయం కల్పించబోతోంది. సరిగ్గా ఇప్పుడు మనం గూగుల్ పే, ఫోన్ పే ఎలాగైతే వాడుతున్నామో... ఇకపై వాట్సాప్ లోనూ అలాంటి సేవలు ప్రారంభం కాబోతున్నాయి.
ఈ విషయాన్నీ వాట్సాప్ యజమాని మార్క్ జుకెర్బెర్గ్ వెల్లడించారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. మార్క్ జుకెర్బెర్గ్ ఫేస్బుక్ ఫౌండర్ కూడా కావటం తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం రూ 1 లక్ష కోట్లకు పైగా చెల్లించి ఫేస్బుక్ ... వాట్సాప్ ను కొనుగోలు చేసిన విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీలు ఊపందుకున్న తరుణంలో డిజిటల్ పేమెంట్ల రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. అందుకే గూగుల్ సహా అన్ని బడా కంపెనీలు ఈ సెగ్మెంట్ లోకి ప్రవేశించి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ రైతులు నిజంగానే మహారాజులు... వారి ఆదాయం రూ 25 కోట్లు!
ఫోటో పంపినంత సులభం...
ప్రస్తుతం మనం వాట్సాప్, ఫేస్బుక్ లో ఒక ఫోటో షేర్ చేసుకోవటం ఎంత సులభమో ... సరిగ్గా అంతే వేగంగా, సులభంగా నగదు కూడా బదిలీ చేసుకోవచ్చని మార్క్ జుకెర్బెర్గ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రస్తుతం ఫేస్బుక్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో ఆరు నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే గనుక ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ఫారం ల తో చిన్న చిన్న మర్చంట్లు తమ వ్యాపారాల పేమెంట్లు ఆన్లైన్ లో స్వీకరించేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చిన్న వ్యాపారులు ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
40 కోట్ల మంది ...
ప్రస్తుతం ఇండియాలో వాట్సాప్ కు పెద్ద ఎత్తున వినియోగదారులు ఉన్నారు. సుమారు 40 కోట్ల మందికి పైగా కస్టమర్లు రోజూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ పే అందుబాటులోకి వస్తే వీరందరికీ సులభమైన, సౌకర్యంగా నగదు బదిలీ చేసుకునే సదుపాయం లభిస్తుంది. వాట్సాప్ పే కూడా మిగితా డిజిటల్ పేమెంట్ ఆప్ ల వలే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారితంగా పనిచేస్తుంది. కాబట్టి కస్టమర్ బ్యాంకు అకౌంట్ నుంచి నేరుగా ఎంపిక చేసుకున్న వ్యక్తి ఖాతాలోకి నగదు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కానీ వాట్సాప్ పే సేవలు అందించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే లైసెన్సు కోసం సంస్థ దరఖాస్తు చేసినప్పటికీ ఇంకా వాట్సాప్ పే కు అనుమతి లభించలేదు.దీంతో భారత్ లో కార్యకలాపాలపై ఇంకా స్పష్టత రాలేదు.
పేటీఎం, గూగుల్ పే లకు గట్టి పోటీ..
ఒకవేల వాట్సాప్ పే కు ఇండియాలో అనుమతి లభిస్తే... ఇప్పటికే ఈ రంగంలో సేవలు అందిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి సంస్థలకు గట్టి పోటీ ఎదురవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగదు బదిలీ కోసం ఈ ఆప్ లను అదనంగా డౌన్లోడ్ చేసుకుంటున్న వినియోగదారులు... ఇకపై వాట్సాప్ లోనే పేమెంట్ ఫీచర్ ఉంటే వాటిని వినియోగిస్తారా లేదా చూడాలని వారు పేర్కొంటున్నారు. వాట్సాప్ పే సదుపాయం అందుబాటులోకి వస్తే ఇకపై ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మెస్సేగింగ్ ప్లాట్ఫారం పై కూడా బిజినెస్ నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది. ఇది కోట్ల మంది వినియోగదారులకు, లక్షలాది వ్యాపారులకు మేలు చేసేలా ఉంటుందని మార్క్ జుకెర్బెర్గ్ ఆలోచన.