కరోనా దెబ్బ: సగానికి పడిపోయిన మారుతీ సేల్స్, 90% తగ్గిన అశోక్ లేలాండ్
మార్చి నెలలో దేశీయ ఆటోమొబైల్స్ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఆటో సేల్స్ భారీగా తగ్గిపోయాయి. కరోనా కారణంగా జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి కారణాలతో దుకాణాలు మూతబడ్డాయి. దీంతో విక్రయాలు నిలిచాయి. ఈ ప్రభావం 40 శాతం నుండి 80 శాతం వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఆటో మొబైల్స్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జీఎస్టీ, నోట్ల రద్దు సమయంలోను ఈ ప్రభావం పడింది. గత ఏడాది సేల్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు కరోనా ప్రభావం వాటి కంటే ఎక్కువే ఉంది.

తగ్గిన విక్రయాలు
మార్చిలో దాదాపు 1,50,000 యూనిట్ల ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయించినట్లుగా అంచనా. ఇది గత ఏడాది ఇదే మార్చితో పోలిస్తే సగం కంటే తక్కువ. వాణిజ్య వాహనాల విక్రయాలు భారీగా పడిపోయాయి. మార్చి 31తో బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామని లాక్ డౌన్కు ముందు ప్రకటించారు. దీంతో ఈ విక్రయాలు తగ్గాయి. లాక్ డౌన్ తర్వాత అమ్మకాలు ఉండవు. కానీ లాక్ డౌన్ తర్వాత కొన్ని రోజుల పాటు బీఎస్ 4 వాహనాల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడం కొంతలో కొంత ఊరట.

90 శాతం తగ్గిన అశోక్ లేలాండ్ సేల్స్
హిందూజా గ్రూప్ కంపెనీకి చెందిన అశోక్ లేలాండ్ బుధవారం తమ సేల్స్ 90 శాతం తగ్గిపోయినట్లుగా తెలిపింది. మార్చి నెలలో కేవలం 2,179 వాహనాలు మాత్రమే సేల్ అయ్యాయి. గత ఏడాది ఇదే మార్చి నెలలో 21,535 విక్రయించింది. డొమెస్టిక్ సేల్స్ గత ఏడాది 20,521 ఉండగా, ఇప్పుడు 91 శాతం పడిపోయి 1,787 అమ్ముడయ్యాయి. లైట్ కమర్షియల్ వెహికిల్ సేల్స్ గత ఏడాది మార్చిలో 5,286 సేల్ కాగా, ఇప్పుడు 289కే పరిమితమయ్యాయి. అంటే 95 శాతం పడిపోయాయి.

మారుతీ సేల్స్
మారుతీ సుజుకీ సేల్స్ 47 శాతం పడిపోయాయి. గత ఏడాది 158,076 యూనిట్లు విక్రయించిన మారుతీ ఈ ఏడాది కేవలం 83,792కే పరిమితమైంది. గత ఏడాదిలో మొత్తం 15,63,297 యూనిట్లు విక్రయించింది. సుజుకీ మోటార్స్ విక్రయాలు గత ఏడాది 147,613 ఉండగా ఇప్పుడు 46 శాతం క్షీణించి 79,080 యునిట్లుగా ఉంది. ఎగుమతులు 55 శాతం పడిపోయి 10,463 నుండి 4,712కు పడిపోయాయి.


Click it and Unblock the Notifications