రూ.4,600 పరిహారం, అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో భారీ ఊరట
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆర్బిట్రేషన్ తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనిల్ అంబానీకి అత్యున్నత న్యాయస్థానం తీర్పు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ఢిల్లీమెట్రో - రిలయన్స్ ఇన్ఫ్రా కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 2017లో ఆర్బిట్రేషన్ ట్రైబ్యూనల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. రిలయన్స్ ఇన్ఫ్రాకు వడ్డీతో కలిపి పరిహారం చెల్లించాలని ఢిల్లీ మెట్రోకు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.4,660 కోట్ల వరకు ఉంటుంది. వివిధ కారణాలతో అనిల్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ పరిహారంతో కాస్త ఆర్థిక ఇబ్బందులు తగ్గవచ్చు. ఈ తీర్పు నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ దాదాపు ఐదు శాతం లాభపడింది.
రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఒక విభాగం 2008లో దేశంలోనే తొలి ప్రయివేటు రైలు సేవలు అందించేందుకు ఒప్పందం చేసుకున్నది. కానీ ఫీజు, నిర్వహణ అంశాల్లో వివాదం చెలరేగడంతో 2012లో కాంట్రాక్ట్ నుండి బయటకు వచ్చింది. పరిహారం కోసం ఢిల్లీ మెట్రోపై ఆర్బిట్రేషన్ కేసును దాఖలు చేసింది. ఈ స్టాక్ 4.95 శాతం లాభపడి రూ.74.20 వద్ద క్లోజ్ అయింది.