నేను ఒక్కటే చెబుతున్నా: అగ్నివీరులకు ఆనంద్ మహీంద్రా వెల్కం
దేశవ్యాప్తంగా పలుచోట్ల అగ్నిపథ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎక్కువ వర్గాలు భావిస్తున్నాయి. 17.5 ఏళ్లకు అగ్నిపథ్లో చేరి, 21 ఏళ్ళకు బయటకు వస్తారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేతన రూపంలో దాదాపు రూ.12 లక్షలు, ఆ తర్వాత రిటైర్మెంట్ సమయంలో దాదాపు రూ.12 లక్షలు వస్తాయి. మొత్తంగా వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిపి రూ.23.50 లక్షల వరకు వస్తాయి. అయితే దీనిని డబ్బు రూపంలో చూడటం కాకుండా క్రమశిక్షణ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డిసిప్లేన్, యువత దురలవాట్లకు అలవాటుపడకుండా ఉండటం, అంతర్గత దేశద్రోహుల్ని ఎదుర్కొనే సాహసం వంటివి అదనపు ప్రయోజనాలు.
అయితే ఈ స్కీంను పలువురు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆందోళనలు హింసాత్మకంగా కూడా మారాయి. అయితే తమ సామరస్య ఆందోళనలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకొని రావడంతో హింసాత్మకంగా మారిందనేది కూడా కొందరి మాట. అయితే అగ్నిపథ్ నుండి బయటకు వచ్చాక వారికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుందనేది కేంద్రం మాట.
తాజాగా, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ స్కీం పైన స్పందించారు. హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు, అగ్నివీరులకు ఓ ఆఫర్ కూడా ప్రకటించారు. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసి రిటైల్ అయిన వారికి తమ సంస్థలో పని చేసే అవకాశం కల్పిస్తామన్నారు. గత ఏడాది ఈ పథకం గురించి తెలిసినప్పుడు తాను ఒక విషయం చెప్పానని, ఇప్పుడు అదే చెబుతున్నానని, ఈ పథకంతో అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి లభించేలా చేస్తాయని చెప్పారు. అలాంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తుందని తెలిపారు.