డీబీఎస్ బ్యాంకుగా లక్ష్మీ విలాస్, రూ.25వేల కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోవచ్చు
దాదాపు శతాబ్దం చరిత్ర కలిగిన లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB) నేటి నుండి (శుక్రవారం, నవంబర్ 27) సింగపూర్ డీబీఎస్ బ్యాంకు(ఇండియా) విభాగం కిందకు వచ్చింది. దీంతో ఈ బ్యాంకుపై ఆర్బీఐ ఈ నెల ప్రారంభంలో విధించిన ఆంక్షలు తొలగిపోతున్నాయి. లక్ష్మీ విలాస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ ఏమంటే నెల మారటోరియం విధించినప్పటికీ, ఈ రోజు నుండి డీబీఎస్లో విలీనం కావడంతో ఇప్పుడు రూ.25,000 కంటే ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం మరిన్ని వార్తలు
డీబీఎస్ బ్యాంకుగా ఎల్వీబీ...
లక్ష్మీ విలాస్ బ్యాంకు డిపాజిటర్లు, కస్టమర్లు ఇక నుండి డీబీఎస్ బ్యాంకు కస్టమర్లుగా తమ ఖాతాలను నిర్వహించుకోవచ్చునని, ఇది నవంబర్ 27వ తేదీ నుండి అమలులోకి వస్తుందని లక్ష్మీ విలాస్ బ్యాంకు రెగ్యులేటరీకి ఇచ్చిన ఫైలింగ్లో తెలిపింది. ఆర్బీఐ విధించిన మారటోరియం నిలచిపోతుందని, డీబీఎస్ బ్యాంకు ఇక నుండి లక్ష్మీ విలాస్ బ్యాంకు కస్టమర్లకు కూడా సేవలు అందిస్తుందని అందులో పేర్కొంది. LVB బ్యాంకు పైన ఆర్బీఐ నవంబర్ 17వ తేదీన నెల రోజుల పాటు మారటోరియం విధించింది. అయితే పది రోజుల్లోనే LVB-డీబీఎస్ డీల్ పూర్తవడంతో కస్టమర్లకు గుడ్ న్యూస్ వచ్చింది.
ఇటీవలే కేంద్రం ఆమోదం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనంపై కేంద్ర మంత్రివర్గం రెండు రోజుల క్రితం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్లో విలీనం చేయడానికి కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డిపాజిట్ల ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, ఈ నిర్ణయం వల్ల ఎల్వీబీలోని 20 లక్షల మంది ఖాతాదారులకు చెందిన రూ.20వేల కోట్ల డిపాజిట్లతో పాటు 4వేల మంది ఉద్యోగులకు రక్షణ లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
విలీనంపై స్టేకు నో
LVB, డీబీఎస్ బ్యాంకు ఇండియాల విలీనంపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను బాంబే హైకోర్టు గురువారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీ విలాస్ బ్యాంకు ప్రమోటర్లు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వేసిన పిటిషన్ పైన జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం విలీనంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.