ధరలు పెరిగినప్పటికీ, ఎల్పీజీ సిలిండర్ల వినియోగం భారీగా పెరిగింది
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగం 7.3 శాతం మేర పెరిగినట్లు చమురు రంగ కంపెనీలు వెల్లడించాయి. ఓ వైపు ధరలు పెరిగినప్పటికీ, మరోవైపు గ్యాస్ సిలిండర్ వినియోగం మాత్రం పెరిగినట్లు వెల్లడించాయి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (PMUY) కస్టమర్ల వినియోగం ఏకంగా 23.2 శాతం పెరిగినట్లు వెల్లడించాయి. గత ఏడాదితో పోలిస్తే మొత్తం దేశీయ ఎల్పీజీ అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 21 వరకు 10.3 శాతం వృద్ధిని నమోదు చేశాయని IOCL తెలిపింది.
ఎల్పీజీ ధరలు ఇటీవల బాగా పెరిగినప్పటికీ, PMUY కస్టమర్లలో ఎల్పీజీ సిలిండర్ల వినియోగం మెరుగుపడింది. ఈ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ త్రైమాసికంలో ఎల్పీజీ వినియోగంలో 23.2 శాతం పెరుగుదల ఉంది. ఇందుకు PMUY లబ్ధిదారులకు ఇచ్చిన మూడు ఉచిత ఎల్పీజీ రీఫిల్స్ కారణమని చెప్పవచ్చు.
కేంద్రం పేదలకు వంట గ్యాస్ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో PMUY స్కీంలో 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను రూ.12,800 కోట్ల ప్రభుత్వ వ్యయంతో లబ్ధిదారులకు అందించింది. కరోనా సమయంలో అట్టడుగు స్థాయిలో ఉన్నవారి సమస్యలను గుర్తించి PMUY లబ్ధిదారులకు మూడు ఉచిత ఎల్పీజీ రీఫిల్స్ అందించింది. మొత్తం రూ.9,670 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అయ్యాయి. లాక్డౌన్ సమయంలో ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 14 కోట్ల ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందుకున్నారు.