జీఎస్టీని తగ్గించాలి, విదేశాల్లో మన వాహన బ్రాండ్స్ను ప్రమోట్ చేయాలి
ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వాణిజ్య శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. విదేశాల్లో భారతీయ బ్రాండ్స్ను ప్రమోట్ చేయడానికి అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని వెల్లడించింది. ప్రస్తుతం 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని పేర్కొంది.
అలాగే, దేశీయ పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎకానమీ: చాలెంజెస్ అండ్ ఆపర్చ్యునిటీస్ ఫర్ ఇండియా అనే పేరుతో రూపొందించిన నివేదికను 10వ తేదీన పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. దేశీయ బ్రాండ్స్ అభివృద్ధితో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ బ్రాండ్స్ను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని స్థాయి సంఘం కోరింది.
ఇతర దేశాల్లోని మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై పరిశీలన జరిపి, ఆయా దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని సూచించింది. RODTEP (రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్) పథకం కింద ఆటోమొబైల్ ఎగుమతులకు గతంలో అందించిన స్థాయికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువస్థాయిలో పన్ను రీయింబర్స్మెంట్స్ ఇవ్వాలని పేర్కొంది.