మారటోరియంపై SBI చైర్మన్ కీలక వ్యాఖ్య, HDFC చైర్మన్తో ఏకీభవించిన రజనీష్
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీనిని డిసెంబర్ వరకు పొడిగించాలని వివిధ వర్గాల నుండి డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకున్నందున మారటోరియం పొడిగింపు అవసరం లేదని HDFC బ్యాంకు చైర్మన్ దీపక్ పరేఖ్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ తర్వాత లోన్ మారటోరియం పొడిగింపు అవసరం లేదని చెప్పారు.

పొడిగింపు అవసరం లేదు
కరోనా కారణంగా మార్చి నుండి ఆగస్ట్ 31వ తేదీ వరకు మారటోరియం ఉందని, దీనిని ఇంతకుమించి పొడిగించాల్సిన అవసరం లేదని రజనీష్ కుమార్ అన్నారు. రుణ మారటోరియం పొడిగింపు ఆగస్ట్ తర్వాత అవసరం లేదని, తనతో సహా ఏ బ్యాంకర్ ఈ పొడిగింపు కోరుకోరని అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల జరిగిన నష్టానికి ఆరు నెలల కాలం మారటోరియానికి సరిపోతుందన్నారు. ఈఎంఐ వాయిదాలకు ఆరు నెలల కాలమే చాలా ఎక్కువ సమయం అన్నారు. మారటోరియాన్ని పొడిగించవద్దన్న దీపక్ పరేఖ్తో ఆయన ఏకీభవించారు.

చెల్లించగలిగే సామర్థ్యం ఉన్నవారు తప్పించుకుంటారు
దయచేసి మారటోరియాన్ని పొడిగించవద్దని, చెల్లించగలిగే సమర్థత ఉన్న కార్పోరేట్లు, వ్యక్తులు ఈఎంఐలను వాయిదా వేసేందుకు దీనిని అనుకూలంగా మార్చుకుంటారని రజనీష్ కుమార్ అన్నారు. మారటోరియం పొడిగింపు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, అదే జరిగితే చిన్న తరహా ఎన్బీఎఫ్సీలు దారుణంగా నష్టపోతాయన్నారు.

రూ.40 లక్షల కోట్ల రుణాలు.. పెండింగ్
రుణమారటోరియం కారణంగా ప్రస్తుతం బ్యాంకింగ్ ఇండస్ట్రీకి రూ.40 లక్షల కోట్ల ద్రవ్యత నిలిచిపోయినట్లుగా భావిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ఈ మొత్తం తాత్కాలిక నిషేధంలో ఉందన్నారు. కార్పోరేట్ రంగానికి రిటైల్, టర్మ్ లోన్లు రెండూ ఉన్నాయి. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఎన్పీఏలు పెరిగే అవకాశముందని అంటున్నారు.


Click it and Unblock the Notifications