ఇక పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ టెక్నాలజీ దిగ్గజం కీలక నిర్ణయం!
కరోనా మహమ్మారి నేపథ్యంలో టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావొస్తుండటంతో కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎత్తివేస్తున్నాయి. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల తమ సిబ్బందికి ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యానికి ముగింపు పలికింది. ఈ మేరకు తమ ఉద్యోగులకు గతవారం మెమో పంపించినట్లు వార్తలు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ టెక్ దిగ్గజాలపై పని ప్రభావం తక్కువగా పడింది. అయితే ఆఫీస్ వాతావరణం ఉండాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి.
ఆఫీస్కు రావడం కోసం వ్యాక్సీన్
పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల భద్రత కోసం సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాయి. కరోనా ప్రభావం తగ్గి, పరిస్థితులు సాధారణస్థాయికి చేరుకోగానే తమ సిబ్బందిని కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. ఇందులో భాగంగా పలు సంస్థలు ఉద్యోగులకు తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశాయి. మరికొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెకండ్ డోస్ను కూడా పూర్తి చేశాయి.
ఆఫీస్కు రప్పించాలనుకున్నప్పటికీ...
పలు ఐటీ కంపెనీలు, సంస్థలు తమ సిబ్బందిని వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతించాయి. కానీ చిన్న సంస్థలు, స్టార్టప్స్ తమకు టెక్నాలజీ రిసోర్సెస్ సరిపడా లేకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నాయి. కార్పోరేట్ సంస్థలు కార్యాలయాలు తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఇటీవల కరోనా సెకండ్ వేవ్, ఇప్పుడు డెల్టా వేరియంట్ ఆందోళనతో వాయిదా వేస్తున్నాయి.
దేశీయ ఐటీ దిగ్గజాలు
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సెప్టెంబర్ చివరి నుండి తమ సిబ్బంది, కుటుంబాలకు వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తోంది. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు వ్యాక్సీన్ ప్రక్రియను చేపట్టామని, మే నెలలో దీనిని ప్రారంభించామని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ చెప్పారు. దాదాపు డెబ్బై శాతం మంది ఉద్యోగులు పూర్తిగా లేదా పాక్షికంగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. విప్రో సెప్టెంబర్ వరకు వేచి చూసి ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోం పైన నిర్ణయం తీసుకోనుంది. ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రమ్ హోంకు త్వరలో స్వస్తీ చెప్పే ఆలోచనలో ఉంది.
లింక్డిన్ ఉద్యోగులకు...
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా లింక్డిన్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై తమ ఉద్యోగులకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు, అవసరమైతే పార్ట్ టైమ్ కార్యాలయానికి వచ్చే వెసులుబాటు కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న 16,000 మంది ఉద్యోగులకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. అయితే, కొన్ని విధులు ఆఫీసుకు వస్తే గానీ పూర్తి చేయలేమని, అలాంటి పరిస్థితులో కచ్చితంగా ఆఫీస్కు రావాలని లింక్డిన్ యాజమాన్యం తెలిపింది.