FY21 తొలి 9 నెలల్లో డెత్ క్లెయిమ్స్ ఎంత పెరిగాయంటే?
ఎల్ఐసీ డెత్ క్లెయిమ్స్ ఏప్రిల్ 2020-డిసెంబర్ 2020 మధ్యకాలంలో భారీగా పెరిగి 8 లక్షల మార్కును క్రాస్ చేశాయి. అంతకుముందు మూడేళ్లు క్షీణించగా, ఈసారి కరోనా కారణంగా భారీగా పెరిగాయి. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఎల్ఐసీలో 8,16,652 క్లెయిమ్స్ నమోదయ్యాయి. 2019లో అదే కాలం 6,97,314తో పోలిస్తే ఇది 17.11 శాతం అధికం. ఈ తొమ్మిది నెలల కాలంలో ఎల్ఐసీ 8,08,575 డెత్ క్లెయిమ్స్ను సెటిల్ చేసింది. ఇందుకు గాను రూ.16,945.96 కోట్లు చెల్లించింది. ప్రధానంగా అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా 4,50,849 క్లెయిమ్స్ ఉండగా, ఏప్రిల్- జూన్ మధ్యకాలంలో 1,68,301 క్లెయిమ్స్ వచ్చాయి. అయితే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు లాక్డౌన్ నేపథ్యంలో క్లెయిమ్స్ తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
డెత్ క్లెయిమ్స్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7,57,463 రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత 2018-19లో 7,15,389 నమోదయ్యాయి. భారత్లో కొవిడ్ 19 తొలి వేవ్లో ఇన్ఫెక్షన్ వల్ల జరిగిన మరణాల రేటు తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో దాదాపు 5వేల కొవిడ్ అనుబంధ క్లెయిమ్స్ రికార్డు కాగా, ఆ సంస్థ రూ.340 కోట్లు చెల్లించింది. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.340 కోట్లు, HDFC లైఫ్ 1,271, 542 గ్రూప్ సెటిల్మెంట్లు పూర్తయ్యాయి.