LIC డివిడెండ్ రూ.2,610 కోట్లు, చరిత్రలో తొలిసారి రూ.50వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) డిసెంబర్ 27న ప్రభుత్వానికి రూ.2,610.74 కోట్ల డివిడెండ్ చెల్లించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను దీనిని ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ రూ.53,214.41 కోట్ల సంపదను సృష్టించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 9.9 శాతం అధికం.
గృహసిద్ధి: హోమ్ లోన్ తీసుకునే వారికి LIC సూపర్ ఆఫర్
ఎల్ఐసీ చరిత్రలో తొలిసారి రూ.50వేల కోట్లు
ఎల్ఐసీ పాలసీ విక్రయాల్లో 76.28 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 30 నవంబర్ 2019 నాటికి తొలి ఏడాది ప్రీమియం వసూళ్లలో 71 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఎల్ఐసీ కంపెనీ చరిత్రలో ఒక ఏడాదిలో రూ.50వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సృష్టించడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
నిర్మలా సీతారామన్ చేతికి చెక్కు
రూ. 2,610 కోట్ల విలువైన డివిడెండ్కు సంబంధించిన చెక్కును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ శుక్రవారం అందించారు. ఎల్ఐసీ 63 ఏటిలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం దీని ఆస్తులు రూ.31.11 లక్షల కోట్లు.
సంస్థ వార్షిక ఆదాయం రూ.5.61 లక్షల కోట్లు
సంస్థ వార్షిక ఆదాయం రూ.5.61 లక్షల కోట్లుగా ఉంది. 2018-19లో తొలి వార్షిక ప్రీమియం ఆదాయం రూ.1,42,191.69 కోట్లుగా ఉంది. అదే ఏడాది రూ.1.63 లక్షల కోట్ల విలువైన 2.59 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు రూ.2,610.74 కోట్ల చెక్కును ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ అందించారని, ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.