సెప్టెంబర్ తర్వాతే..: సౌదీ ఆరామ్కో తర్వాత జాబితాలో ఎల్ఐసీ IPO, ఉద్యోగుల ఆగ్రహం
2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండో అర్ధభాగంలో తర్వాతే లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC)ని స్టాక్ మార్కెట్లో నమోదు చేస్తామని కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ అన్నారు. స్టాక్ మార్కెట్లో నమోదుకు ముందు పాటించాల్సిన అనేక ప్రక్రియలు ఉన్నాయని ఆదివారం తెలిపారు. శాసన మార్పులు చేయాల్సిఉందని, ఇందుకు న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అన్నీ పూర్తయి లిస్టింగ్ చేసేందుకు సమయం పడుతుందన్నారు.
దేశంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించనున్న ఎల్ఐసి!
సెప్టెంబర్ తర్వాత లిస్టింగ్
ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత ఎల్ఐసీ లిస్టింగ్ ప్రక్రియ ఉండవచ్చునని రాజీవ్ కుమార్ చెప్పారు. ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంకుల్లో వాటా విక్రయించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కూడా ఇందుకు అనుగుణంగానే రూ.2.10 లక్షల కోట్లుగా నిర్దేశించుకుంది.
ఆరామ్కోతో పాటు..
ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వం వాటా 100 శాతం. ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటా ఉంది. అరవై ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్ఐసీకి బీమా రంగంలో 70 శాతానికి పైగా మార్కెట్ ఉంది. పాలసీల విక్రయాల్లో 76.28 శాతం, తొలి ఏడాది ప్రీమియం వసూళ్లలో 71 శాతం వాటా ఉంది. ఎల్ఐసీపై మార్కెట్లు బుల్లిష్గా ఉన్నాయి. ఈ శతాబ్దపు అత్యంత ఖరీదైన ఐపీవోల్లో సౌదీ ఆరామ్కోతో పాటు ఎల్ఐసీ కూడా జాబితాలో ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఉద్యోగుల యూనియన్ వ్యతిరేకత
మరోవైపు, ఎల్ఐసీలో వాటా విక్రయ ప్రక్రియను ఆల్ ఇండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది. ఎల్ఐసీలో వాటా విక్రయ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 4న ఒక గంట పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజేష్ నింబాల్కర్ చెప్పారు. ఆ తర్వాత వరుసగా ఆందోళనలు చేపడతామన్నారు.