adani: వామ్మో, ఇంత దారుణమా ! అదానీ సంక్షోభం వల్ల LIC నష్టపోయింది ఎంతో తెలుసా?
adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం అదానీ గ్రూపు అల్లకల్లోలం కావడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలు, ప్రభుత్వ సంస్థల లక్షలాది కోట్ల పెట్టుబడి ఆవిరి అయ్యింది. ఈ క్షీణత ఇప్పట్లో ఆగేలా లేదని మార్కెట్ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారం మీద స్పదించాలని ప్రజలు, విపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఎక్స్ పోజర్ కు ఏమాత్రం ఢోకా లేదని పైకి గంభీరంగా ప్రకటించినా, లోలోపల మదన పడుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అరవై నుంచి ముప్పై వరకు:
అదానీ గ్రూపు సంక్షోభం కారణంగా ఆ కంపెనీల్లో లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ పెట్టుబడిగా పెట్టిన ప్రజాధనం విలువ కోల్పోయింది. దాని ఇన్వెస్ట్ మెంట్ నెగిటివ్ గా మారింది. పోర్టుల దగ్గర నుంచి పవర్ వరకు ఆ గ్రూపులో ఇప్పటివరకు రూ.30,127 కోట్లను LIC ఇన్వెస్ట్ చేసింది. అయితే దాని విలువ రూ.30 వేల కోట్లకు పడిపోయింది. గతేడాది డిసెంబరు నాటికి ఈ పెట్టుబడి విలువ రూ.62,550 కోట్లు ఉండగా, హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం జనవరి 27 నాటికి రూ.56,142 కోట్లకు క్షీణించింది. అప్పటి నుంచి ఏకధాటిగా పడుతూనే ఉంది.
లాభాలు తరువాత.. పెట్టుబడి పరిస్థితేంటి?
మార్కెట్ లో లిస్ట్ కాబడిన 10 అదానీ గ్రూపు సంస్థలు 50 శాతాన్ని మించి నష్టాలు మూటగట్టుకున్నాయి. వికీపీడియా ఆర్టికల్స్ ని తారుమారు చేశారన్న వార్త రావడంతో బుధవారం మరో రూ.50 వేల కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఆ సంస్థలు రూ.11 లక్షల కోట్లకు పైగా నష్టపోగా.. పరిస్థితి మరింత దుర్భరంగా తయారవుతోంది. LICతో పాటు భారతీయ బ్యాంకులు, ఆస్ట్రేలియన్ రిటైర్మెంట్ ఫండ్స్ కు సంబంధించిన ఎక్స్ పోజర్ ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది.
భారతీయ సూచీల్లోనూ ఒడిదుడుకులు:
హిండెన్ బర్గ్ ఆరోపణలను ఎదుర్కోవడానికి అదానీ గ్రూపు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మార్కెట్ ఫాల్ మీద ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. ఆయా కంపెనీల రుణ వ్యవహారాలపై సెబీ సైతం దర్యాప్తు జరుపుతోంది. ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ 3 స్థానం నుంచి గౌతమ్ అదానీ 29 కి పడిపోయారు. ఈ భారీ కుదుపు కారణంగా ప్రపంచంలోని మొదటి 5 స్థానాల్లో ఉండాల్సిన భారతీయ సూచీలు సైతం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.