LIC Mobile app: ఏజెంట్లు, ఏజెన్సీలపై రియల్టైమ్ నిఘా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో కొనసాగుతూ- ప్రైవేటు కత్తిని ఎదుర్కొంటోన్న అతి పెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓ మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. దీని పేరు- ప్రగతి. ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఆధారంగా పని చేస్తోన్న స్మార్ట్ఫోన్ యూజర్లు దీన్ని వినియోగించుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తమ స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రైవేటీకరణకు సిద్ధపడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొబైల్ యాప్ అందుబాటులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కార్పొరేట్ పరం కాబోతోన్న నేపథ్యంలో- ఎల్ఐసీ అదే తరహా పనితీరును అందిపుచ్చుకుంటోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. రియల్ టైమ్ పెర్ఫార్మెన్స్ను ఎప్పటికప్పుడు గుర్తించడానికి ఉద్దేశించిన యాప్ ఇది. సమగ్రమైన పెర్ఫార్మెన్స్ రివ్యూ అప్లికేషన్, గ్రోత్ అండ్ ట్రెండ్ ఇండికేటర్గా దీన్ని భావించవచ్చని ఎల్ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ గుప్తా, రాజ్ కుమార్, సిద్ధార్థ మొహంతితో కలిసి ఈ యాప్ను ఆయన ఆవిష్కరించారు.
దేశవ్యాప్తంగా కార్పొరేషన్లో పనిచేసే ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ల సౌకర్యం కోసం మేనేజ్మెంట్ ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వందలాది ఏజెన్సీలు ఎల్ఐసీ ఆధీనంలో పని చేస్తోన్నాయి. వాటి రియల్ టైమ్ డెవలప్మెంట్ను పర్యవేక్షించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా ఈ సౌకర్యం ఎల్ఐసీలో లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుంటోన్న నేపథ్యంలో ఇది అందుబాటులోకి వచ్చింది.
పాలసీదారుల నుంచి ప్రీమియం కలెక్షన్లు, ఏజెన్సీ కార్యకలాపాలు, ఎండీఆర్టీ ప్రాస్పెక్టివ్స్, ఎల్ఐసీ ఏజెంట్లు ఏ స్థాయిలో యాప్లను వినియోగిస్తున్నారు, వేలిడేషన్లను పర్యవేక్షిస్తున్నారనే విషయాలను తెలుసుకోవడానికి ఈ ప్రగతి యాప్ దోహదపడుతుందని ఎంఆర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ వ్యవస్థ ప్రపంచాన్ని శాసిస్తోందని, దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఏజెంట్ కూడా అప్డేట్ కావాల్సి ఉందని చెప్పారు. సమగ్రమైన ఈ యాప్ వల్ల రియల్ టైమ్లో ఏజెన్సీలు, ఏజెంట్ల పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు.
ఇదివరకు ఎల్ఐసీ- ఆనంద యాప్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. డిజిటల్, పేపర్లెస్ సొల్యూషన్స్గా దీన్ని పిలుస్తుంటారు ఎల్ఐసీ ఉద్యోగులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఈ డిజిటలీకరణ, యాప్ ద్వారా ఎల్ఐసీ ఎలాంటి నష్టాలను కూడా చవి చూడలేదు. పాలసీదారులు ఈ సౌలభ్యాల ద్వారా ఎప్పటికప్పుడు తమ ప్రీమియంలను చెల్లిస్తూ వచ్చారు. అదే కరోనా వైరస్ కాలంలో చాలా చోట్ల ఏజెన్సీల కార్యకలాపాలు సమర్థవంతంగా నడవట్లేదని, ఏజెంట్ల మీద పర్యవేక్షణ లేదంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రగతి యాప్ను లాంచ్ చేసింది మేనేజ్మెంట్.