adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
adani lic: LIC - భారతీయులకు పరిచయమే అక్కర్లేని పేరు. ఇన్సూరెన్స్ అంటే తెలియని వారు ఉంటారేమో కాని LIC తెలియని భారతీయులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జీవితాల్లో భాగమైంది ఈ బీమా దిగ్గజం. రెండు రోజులుగా అదానీ గ్రూపు కంపెనీలు దారుణమైన నష్టాలను మూటగట్టుకుంటూ ఉండటం తెలిసిందే. LIC సైతం ఈ విషంలో బాధితురాలు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అదానీ గ్రూపు మీద ఆరోపణల పుణ్యమా అని ఇప్పటివరకు దాదాపు 18 వేల కోట్లు నష్టపోయింది. జనవరి 24 నాటికి 81 వేల కోట్లకు పైగా అదానీ కంపెనీల్లో LIC పెట్టుబడులు పెట్టింది. శుక్రవారం నాటికి అందులో 18 వేల కోట్లు ఆవిరయ్యాయి.
81 నుంచి 62 వేల కోట్ల దిగువకు..
దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల్లో LIC ఒకటి. అదానీ గ్రూపు కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, టోటల్ గ్యాస్, ట్రాన్స్మిషన్ తో పాటు ఇటీవల కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, ACC ల్లో 1 శాతానికి పైగా వాటా LIC కి ఉన్నట్లు Ace ఈక్విటీ సంస్థ తెలిపింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఇవి 19 నుంచి 27 శాతం మేర నష్టపోయాయి. అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల కారణంగా.. 81 వేల కోట్లకు పైగా పెట్టిన పెట్టుబడి కాస్తా ఇప్పుడు 62 వేల కోట్లకు పడిపోయింది.
4 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరి..
కంపెనీల పరంగా చూస్తే.. అదానీ టోటల్ గ్యాస్లో 6 వేల కోట్లు, ఎంటర్ప్రైజెస్, పోర్ట్స్, ట్రాన్స్ మిషన్ లో 3 వేల కోట్లు చొప్పన, అంబుజా సిమెంట్స్ లో 1.5 వేలు, గ్రీన్ ఎనర్జీలో 871, ACC లో 544 కోట్ల మేర LIC ఈ రెండు రోజుల్లో నష్టపోయింది. అదానీ గ్రూపులోని మొత్తం 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 24 నాటికి 19 లక్షల కోట్లు ఉండగా.. జనవరి 27 నాటికి 15 లక్షల కోట్లకు పడిపోయింది. BSE ఇండెక్స్ సైతం 1,647 పాయింట్లు కోల్పోవడంలో ఈ కంపెనీలు ప్రధాన పాత్ర పోషించాయి.
వేచి చూడటం బెటరేమో..!
అదానీ ప్రతిష్టను దిగజార్చడం, దేశంలో వస్తున్న అతిపెద్ద FPO ను దెబ్బతీయడమే లక్ష్యంగా హిండెన్ బర్గ్ నిరాధార ఆరోపణలు చేసిందని గ్రూపు CFO జుగేషీందర్ సింగ్ మీడియాకు తెలిపారు. మరింత స్పష్టత కోసం పెట్టుబడిదారులు వేచి ఉండాలని.. కొత్త సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఈ సెల్ ఆఫ్ సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.